
ఎలా చూపించాలి మొఖం!
ఏడాదిలో ఏం చేశాం..
ఛసాక్షి, పార్వతీపురం మన్యం: ఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా.. ఏ ఎమ్మెల్యే కూడా పల్లె గడపకు వెళ్లి ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. నాడు లెక్కకు మించి హామీలిచ్చి.. ఒక్కటీ నెరవేర్చిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో చేసిన ‘సుపరిపాలన’ను ఈ నెల 2వ తేదీ బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. నెల రోజులపాటు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ ప్రతి గడపకూ వెళ్లి, అక్కడి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్నూ సిద్ధం చేశారు. మరోవైపు ఏం చేశామని ప్రజల వద్దకు వెళ్లగలమని నాయకులు వాపోతున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఎమ్మెల్యేల దందా అధికమైంది. ప్రతి పనికీ ఒక ‘రేటు’ కట్టేశారు. ఇసుక, వైన్స్, మైనింగ్.. ఇలా ఏదీ తేడా లేకుండా వాటాలు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ, పేదల భూములను అప్పనంగా కాజేస్తున్నారు. కబ్జాలు, బెదిరింపులు పెరిగిపోయాయి. మరోవైపు ఇంటింటికీ అందిస్తామన్న సంక్షేమానికి మంగళం పాడేశారు. గతేడాది తల్లికి వందనం పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టగా.. ఇటీవల విడుదల చేసిన మొత్తంలో భారీగా కోత పెట్టారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం ఊసేలేదు. ఉచిత ప్రయాణం తుస్సుమంది. నిరుద్యోగ భృతి లేదు. నెలకు రూ.1,500 సాయం కానరాదు. మద్యాన్ని ప్రైవేట్పరం చేసి.. ఊరూరా లభించేలా చేశారు. విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఊరికి దూరం పెట్టారు. దీంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమికి జై కొట్టిన ఉద్యోగులు.. ప్రస్తుతం ప్రభుత్వం తీరుతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బదిలీల్లో నాయకుల ఇష్టారాజ్యమైంది. రూ.లక్షలు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో నాయకులకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం గ్రహించి కూటమి నేతలు కూడా భయపడుతున్నారు.
సమస్యల‘పురం’
● పార్వతీపురం నియోజకవర్గం విషయానికి వస్తే.. జిల్లా కేంద్రంలో డంపింగ్యార్డు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
● తాగునీటి ఎద్దడి నివారణకు పరిష్కారం చూపుతామని ప్రకటించారు.
● డిగ్రీ చదువుకున్న 100 మందిలో 90 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన
● ఇప్పుడున్న డిగ్రీ కళాశాలను పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేసి, హాస్టల్ సౌకర్యం కల్పన
● జంఝావతి, ఆడారుగెడ్డ, వరహాలగెడ్డ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తా..
● మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తాం అన్నారు. వీటిలో ఎన్నినెరవేర్చారో ప్రజలను అడిగితే చెబుతారు.
సెల్ఫీలకే పరిమితం
పాలకొండలోనూ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లతోపాటు.. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అనేక హామీలు గుప్పించారు.
పాలకొండ మండలంలో జంపరకోట మినీ జలాశయం పూర్తి చేస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు. అక్కడికి వెళ్లి సెల్ఫీ కూడా తీసుకున్నారు.
పాలకొండకు రైతుబజారు తీసుకొస్తానని చెప్పారు.
తోటపల్లి కాలువల ఆధునికీకరణ చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చారు.
నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది.. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గట్టిగా.. గట్టిగా అంటూ చెప్పారు. ప్రధానంగా గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
హామీ ఇచ్చారు.. విస్మరించారు
సాలూరులో జీగిరాం జూట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చారు.
ఆటోనగర్ను పునఃప్రారంభించి, లారీ పరిశ్రమను ఆదుకుంటామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 85 శాతం నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఏడాదైనా పూర్తి చేయలేకపోయారు.
జగ్గుదొరవలసలో అక్కడి స్థానికులకు కులధ్రువీకరణ పత్రాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు.
ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని మంత్రిగా తొలి సంతకం కూడా సంధ్యారాణి చేశారు.
మంత్రిగా వచ్చిన మొదటి రోజునే సాలూరు పట్టణంలో మహిళల ఆత్మగౌరవం కోసమని ఉపన్యాసాలిచ్చి.. పాడైన మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెస్తామని చెప్పారు.
మక్కువ–బాగువలస రోడ్డును పూర్తి చేస్తామన్నారు.
డోలీల మోతే లేకుండా చేస్తామని తెలిపారు.
గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు.
ప్రజాప్రతినిధులు, కూటమి నేతల్లో అంతర్మథనం
‘సుపరిపాలన’ అంటూ నెల రోజులపాటు ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమాన్ని వివరించాలంటున్న చంద్రబాబు
నిలదీతలు ఎదురవుతాయేమోనని స్థానిక నేతల్లో భయం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ సమక్షంలోనే స్థానిక నేతలు.. ప్రస్తుత ఎమ్మెల్యేలు గత ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చారు. అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారు. దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారంతా తల్లడిల్లుతున్నారు.
‘కురుపాంలో చదువుకున్న బిడ్డలు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే వర్క్ఫ్రం హోం చేసుకునేలా ఏర్పాటు చేస్తా. నైపుణ్య కేంద్రాలు, స్కిల్ సెన్సర్స్ చేసి మిమ్మల్ని ఆదుకుంటా. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తా.’ అని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కురుపాం సభలో హామీ ఇచ్చారు.
ఏనుగుల వల్ల పంటలు నాశనమవుతున్నాయి. దానికి పరిష్కారం చూపిస్తా.
తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి లిఫ్ట్ ద్వారా నీరందిస్తా.
కొమరాడ, గరుగుబిల్లి మండలాలకు నీరిస్తా. పూర్ణపాడు–లాబేసు మధ్య వంతెన ఏర్పాటు చేస్తా..
కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాలకు సాగునీరిందంచడానికి గుమ్మడిగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తా.
గుమ్మలక్ష్మీపురం మండలంలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ఇప్పిస్తా.
జీవో నంబరు 3 రద్దు చేస్తానని హామీ ఇస్తున్నా.
‘ఎంపీ గీతకు కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరికి సైకిల్గుర్తుపై ఓటేసి గెలిపించే బాధ్యత మీది. మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది’ అంటూ స్వయంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందులో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు.

ఎలా చూపించాలి మొఖం!

ఎలా చూపించాలి మొఖం!