విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు

Jun 22 2025 3:58 AM | Updated on Jun 22 2025 3:58 AM

విశాఖ

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు

15 వేల మంది విద్యార్థులకు భోజనం కరువు

విజయనగరానికి మధ్యాహ్నం ఒంటి గంటకు, మన్యం జిల్లాకు 3 గంటలకు చేరిన బస్సులు

అప్పటివరకు ఆకలితో అలమటించిన విద్యార్థులు

విజయనగరం అర్బన్‌/ విజయనగరం గంటస్తంభం: విశాఖలో యోగా డేకు వెళ్లిన విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. సమయానికి తిండిలేక అవస్థలు పడ్డారు. తిరుగు ప్రయాణంలో జిల్లా సరిహద్దులో వడ్డించిన జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక పారబోశారు. యోగాంధ్ర పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడంపై ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదీ పరిస్థితి...

యోగాపై ప్రజల్లో అవగాహన పెంచాలని నెలరోజుల పాటు ఉద్యోగులను విధులకు దూరం చేసి కోట్లాది రూపాయలు వెచ్చించించి చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం జిల్లా విద్యార్థులను అవస్థలకు గురిచేసింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వెళ్లే 15 వేల మంది విద్యార్థులకు ఆయా కళాశాలలు, హాస్టల్స్‌ నుంచి 140 బస్సులు ఏర్పాటు చేశారు. ముందురోజు సాయంత్రానికే సిద్ధంచేసిన బస్సులను తెల్లవారి జామున 3 గంటలకే బయలుదేరి విద్యార్థులను విశాఖకు తీసుకెళ్లారు. జిల్లాకు కేటాయించిన భీమిలి బీచ్‌కు చేరే సరికి సంబంధిత పార్కింగ్‌ స్థలంలో పార్కింగ్‌ సమస్యతో పాటు కంపార్ట్‌మెంట్‌లో ఇవ్వాల్సిన స్నాక్స్‌, మ్యాట్‌లు అందలేదని విద్యార్థులు వాపోయారు. మ్యాట్‌లు, టీ షర్ట్‌లు లేకుండా, అల్పాహారం లేకుండానే యోగాడే పాల్గొన్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ జిల్లా ప్రవేశాల సరిహద్దులైన భోగాపురం, కొత్తవలస, జొన్నాడ రహదారులలో సంబంధిత బస్సులను ఆపించి టిఫిన్‌, తాగునీరు వంటివి అందించారు. అప్పటికే తిరుగు ప్రయాణం చేసిన పార్వతీపురం మన్యం జిల్లా బస్సుల్లోని యోగా సాధకులకు అల్పాహారం కూడా అందలేదు. వారంతా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్‌లను అశ్రయించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రానికి చేరే సరికి ఒంటి గంట, పార్వతీపురం చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. తొలుత స్నాక్స్‌ పంపిణీని బస్సులు బయలుదేరే సమయంలోనే ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. విశాఖలో స్నాక్స్‌ ఇస్తున్నామని, జిల్లా కేంద్రంలో ఆ ఖర్చు అవసరం లేదని ఒకరోజు ముందు ఓ మంత్రి జిల్లా కేంద్రానికి ఆదేశాలిచ్చారట. దీంతో తొలిరోజు స్నాక్స్‌ పంపిణీ ఆపేశామని, ఇబ్బందులు ఎదురయ్యాయని అధికార వర్గాల్లో చర్చసాగుతోంది.

యోగాంధ్ర కాదు...

ఆకలి రహిత ఆంధ్రా కావాలి

యోగాంధ్రకు తీసుకెళ్లిన గిరిజన విద్యార్థులను ఆకలితో అలమటింపజేయడం విచారకరం. కావాల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర, ఆకలి రహిత ఆంధ్రప్రదేశ్‌. ఒకరోజు ముందు విద్యార్థులందరినీ బస్సుల్లో తరలించడం, వారికి సరైన మరుగుదొడ్లు సదుపాయం కల్పించకపోవడం, సమయానికి తాగునీరు కూడా ఇవ్వకపోవడం దారుణం. ఆకలితో అలమటించిన తీరును చిన్నారులు వివరిస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం డొల్లతనమే.

– ఎన్‌.నాగభూషణం,

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి

ప్రజా సమస్యలు గాలికి వదిలేసి..

విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన విద్యార్థులు ఆకలితో అలమటించడం చూసి బాధకలిగింది. బస్సుల్లో నిద్రపోయిన విద్యార్థులను పట్టించుకునే నాఽథుడే కరువయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని చెబుతూ నిరుద్యోగ భృతి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెనను వంటివి సీఎం చంద్రబాబు ఎగ్గొడుతున్నారు. యోగా పేరుతో మోదీ ప్రశంసల కోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టడం దుర్మార్గం. రెండు రోజులు ప్రైవేటు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చి పిల్లలును చదువుకు దూరం చేశారు. గొప్పల యోగా వల్ల ప్రయోజనం శూన్యం. – రెడ్డి శంకరరావు,

సీపీఎం నగర కార్యదర్శి

గిన్నీస్‌ రికార్డు కోసం.. గిరిజన విద్యార్థులను పస్తులుంచుతారా?

పార్వతీపురం: గొప్పల కోసం, మోదీ మెప్పుకోసం, గిన్నీస్‌ రికార్డు కోసం గిరిజన విద్యార్థులను ఆకలితో అలమటింపజేయడంపై ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్‌ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటలకు వసతిగృహాల విద్యార్థులను బస్సులలో తరలించడం సరికాదన్నారు. సరైన వసతిలేక, పడకునేందుకు సదుపాయంలేక విద్యార్థులు నరకయాతన అనుభవించారన్నారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, అధికారుల తమ పిల్లలను ఇలాగే తరలిస్తారా అని ప్రశ్నించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ఎన్నడూ పట్టించుకోని అధికారులు, పాలకులు యోగాకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థు లను తరలించడం దుర్మార్గమన్నారు. గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు పోష్టికాహారం, మెరుగైన వైద్య అందించి ఆదుకోవాలని కోరారు. గిరిజనుల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్వహించిన యోగాకు బదులుగా గిరిజన ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు ఏర్పాటుచేసి ఈ ప్రాంతీయులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. జంఝావతి, వట్టిగెడ్డ, పూర్ణపాడులాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారా చేస్తోందని, దీనిని రైతులు, యువత గమనించాలని కోరారు. కార్యక్రమంలో నాయ కులు హరికృష్ణ, వికాష్‌, చరణ్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు 1
1/3

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు 2
2/3

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు 3
3/3

విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement