
ప్రాణదాతల ఆకలి కేకలు!
ఆ వాహనాల్లో పని చేసే సిబ్బంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణదాతలే... ఎందుకంటే అత్యవసర సమయాల్లో కుయ్.. కుయ్... అంటూ పరుగులు పెడుతూ ప్రాణాపాయంలో ఉన్న వారికి వైద్య సేవలు అత్యవసరంగా అందించి తరువాత అవసరమైన ఆసుపత్రులకు తరలిస్తారు. ఇంతటి ప్రాధాన్యత గల ఆ వాహనాల్లో పని చేసే సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి కూటమి పాలనలో నెలకొంది. గత ఎన్నికల సమయంలో వేతనం రూ.4వేలు పెంచుతామని హామీనిచ్చిన కూటమి నేతలు పెంపు మాట దేవుడెరుగు... మా వేతనాలు మాకు సకాలంలో చెల్లించాలని వేడుకొంటున్నారు. వారే 108 వాహన సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే...
పాలకొండ రూరల్:
అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపే 108 వాహనాల సిబ్బందికి మూడు నెలలుగా వేతన చెల్లింపుల్లేక ఆకలి కేకలు పెడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరబిందో సంస్థ పర్యవేక్షణలో విధులు చేపట్టిన వీరు కూటమి అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ బాధ్యతలను భవ్య సంస్థకు బదలాయించింది. ఈ క్రమంలో గత ఎన్నికల వేళ 108 సిబ్బంది వేతనాల పెంపు విషయమై కూటమి నేతలు హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుతో పాటు రూ.4వేల వేతనం పెంచుతామని నమ్మబలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా జీతం పెరుగుదల లేక సకాలంలో జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఆకలి కేకలు పెడుతున్నారు. తమ బకాయిల చెల్లింపులెప్పుడని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
అప్పు చేస్తేనే..
108 అంబులెన్సులు 15, నియోనాటెల్ (నవజాతి శిశువుల కోసం కేటాయించిన) వాహనాలు రెండు. జిల్లాలో 15 మండలాల్లో 108 వాహనాలు 17 మైదాన, గిరిజన ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నాయి. వీటిలో 108 అంబులెన్సులు 15 కాగా, నియోనిటల్ (నవజాతి శిశువుల కోసం కేటాయించినవి) వాహనాలు రెండు ఉన్నాయి. ప్రతి వాహనానికి నలుగురు చొప్పున సిబ్బంది, మరో రెండు వాహనాల్లో ఇద్దరు చొప్పున 90 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో పైలెట్ (వాహన డ్రైవర్లు)కు నెలకు రూ.28 వేల వరకు, ఈఎంటీకి రూ.30 వేలు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రూ.20 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. అయితే నెలల కొద్ది 108 సిబ్బంది జీతాలు చెల్లించటం లేదు. మూడు నెలలు కావస్తున్నా వేతన చెల్లింపుల్లేవని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం కోసం ఆందోళన చేసినప్పుడు ఎంతో కొంత చెల్లించి చేతులు దులుపేసుకోవడం పరిపాటిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. జీతాలపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొచ్చే తామంతా కుటుంబ పోషణ, నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లగా తమ లీవ్ ఎన్క్యాష్మెంట్లు దాదాపుగా 60 రోజులతో పాటు గ్రాట్యూటీ, ప్రస్తుత వేతన బకాయిలు మొత్తంగా ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేల నుంచి 2 లక్షల మేర బకాయిలు ఉన్నట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుత నెలలో పిల్లల బడులు, పుస్తకాలు, జీతాలు ఇలా అనేక ఖర్చులు వేధిస్తున్నాయంటున్నారు.
పెరుగుతున్న పనిభారం..
ప్రస్తుతం 108 సిబ్బందిపై పనిభారం అధికంగా ఉంటోంది. వర్షాకాలం కావటంతో రోడ్డు ప్రమాదాలు పెరగడం, అత్యవసర కేసులు, పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రి నుంచి రిఫరల్ కేసులు అధికంగా ఉండటం వల్ల సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల సమయంలో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆసుపత్రులకు చేర్చాల్సి ఉంటుంది. అత్యవసర కేసులకు మెరుగైన చికిత్స, హైరిస్క్ పేషంట్లను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. విధి నిర్వహణలో భాగంగా పగలు, రాత్రి తేడా లేకుండా 108 వాహనాలు తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా కీలక సేవలు అందిస్తున్న తమకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే ఎలా పని చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా భవ్య సంస్థ తమ ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి వివరించి బకాయిల చెల్లింపుతో పాటు జీతాల పెంపు హామీ అమలుకు కృషి చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి బిల్లుల రాక..
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కూటమి ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణను అరబిందో సంస్థ నుంచి భవ్య సంస్థకు అప్పజెప్పింది. వాహనాల నిర్వహణతో పాటు సిబ్బంది జీతాలు కూడా ఆ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గాను ఆ సంస్థకు ప్రభుత్వం పాత వాహనమైతే నెలకు సరాసరిన రూ 2.20 లక్షలు, కొత్త వాహనమైతే దాదాపుగా రూ.1.90 లక్షలు పైబడి చెల్లించాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. వీటితోనే వాహనాల నిర్వహణ, సిబ్బంది జీతాలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రాకపోవటంతో వేతన చెల్లింపులు జరగటం లేదు. ఇదే స్థితి కొనసాగితే వాహనాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతాయని సమాచారం.
108 సిబ్బందికి మూడు నెలలుగా అందని వేతనాలు
15 మండలాల్లో 17 వాహనాలతో అత్యవసర సేవలు
విధుల్లో 90 మంది ఈఎంటీలు, పైలెట్లు
అరబిందో నుంచి భవ్య సంస్థకు 108 సేవల బదలాయింపు
రూ.4వేల వేతనం పెంపునకు కూటమి ప్రభుత్వం హామీ
ఏడాది గడిచినా చర్యలు శూన్యం

ప్రాణదాతల ఆకలి కేకలు!