
కన్నీటి వేదన!
గిరిజన మహిళ
● భర్త లేరు.. పింఛన్ రాదు.. రేషన్ ఇవ్వరు..
● ఇద్దరు చిన్నారులతో అష్టకష్టాలు
పార్వతీపురం రూరల్:
ఆమె ఓ గిరిజన మహిళ.. 19 ఏళ్లకే వివాహం జరిగింది. ఏడాది కిందట భర్త విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. భర్త మృతి చెందే నాటికి సంధ్య మొదటి బిడ్డకు ఏడాది వయసు. అప్పటికే మళ్లీ గర్భిణి కావడంతో తరువాత ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆడ బిడ్డకు నెలల వయసు. అప్పటి నుంచి ఆధారం లేక బిడ్డలతో అవస్థలు పడుతూనే ఉంది. ఆమె కష్టాలు చూసి ఇటు పాలకులకుగాని, అటు అధికారులకుగాని మనసు కరగ లేదు. పింఛన్ మంజూరు కాలేదు. రేషన్ ఇవ్వడం లేదు... ఇది ఓ గిరిజన మహిళ కన్నీటి వేదన. వివరాల్లోకి వెళ్తే..
పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ఉంటున్న కొండగొర్రి సంధ్య భర్త రమేష్తో పాటు ఒక బిడ్డతో ఉన్నంతలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. భర్త రమేష్ ఏడాది కిందట విష జ్వరంతో మృతి చెందాడు. అప్పటికే ఒక చిన్నారితో పాటు నెలల గర్భవతిగా ఉన్న సంధ్య ఒంటరిగా తన జీవితాన్ని అతి కష్టంతో నెట్టుకొస్తోంది. అంతలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్త మరణాంతరం తనకు వితంతు పింఛన్తో పాటు రేషన్ కార్డు మంజూరు చేయాలని సంబంధిత పంచాయతీ అధికారుల వద్ద మొర పెట్టుకుంది. అధికారుల చుట్టూ తన ఓపిక ఉన్నంత మేరకు తిరిగింది. అయినా వారి మనసు చలించలేదు. ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తన ఆవేదనను ప్రజా సంఘాల నాయకుల వద్ద చెప్పుకుంది. సంధ్య బాధను విన్న సీపీఎం నాయకులు కలెక్టర్ దృష్టిలో సోమవారం పెడతామని పింఛన్, రేషన్ కార్డు మంజూరుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.