నరసరావుపేట: పీఆర్సీని అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలనే తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గాంధీపార్కు వద్ద తలపెట్టిన ఒకరోజు నిరాహారదీక్షకు ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహాకు కలెక్టరేట్లో నిరాహారదీక్షపై వినతిపత్రం సమర్పించారు. 12వ పీఆర్సీని అమలు చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్పా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లా కార్యదర్శులు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుందర రావు, ప్రాంతీయ శాఖల బాధ్యులు కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: మూడు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి ఏ. సలోమి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నకరికల్లు, నర్సింగపాడు, చేజర్ల గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లను అపహరించుకు వెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నకరికల్లు పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటలోని శివ సంజీవయ్య కాలనీకు చెందిన తిరువీధుల శ్రీకాంత్, పుల్లలచెరువు మండలం అక్కపాలెం తందాకు చెందిన మేఘావత్ శ్రీను నాయక్, వినుకొండ మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ధూపాటి చిన్న బాల లింగయ్య, నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన పాడిపర్తి నాగిరెడ్డి లను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.


