మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. మాజీ మంత్రి విడదల రజని, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావులు పేర్కొన్నారు. అక్రమ కేసులతో జైలుకెళ్లి బెయిల్పై ఇటీవల బయటకు వచ్చిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం మాచర్లలోని ఆయన కార్యాలయంలో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ నేతలు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా ప్రజాదరణ కలిగిన నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపటమే లక్ష్యంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా పీఆర్కే, పీవీఆర్లకు వారికి ఎటువంటి సంబంధం లేని హత్య కేసులో ఇరికించారన్నారు. అంతటితో ఊరుకోకుండా జైలుకు పంపి శునకానందం పొందారన్నారు. తిరిగి వారు జైలు నుంచి విడుదలైతే వారికి లభించిన ఆదరణను భరించలేని స్థితిలో టీడీపీ నాయకులు లేనిపోని అవాకులు, చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలు ఎంతోకాలం కొనసాగవని, న్యాయం తప్పక గెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట, పెదకూరపాడు నియోజక వర్గాల నుంచి భారీ స్థాయిలో మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు పీఆర్కే కార్యాలయానికి చేరుకొని ఆయనకు జే జేలు పలుకుతూ ఆయనను సత్కరించారు.
అక్రమ కేసులతో జైళ్లకు పంపి శునకానందం పొందుతున్న కూటమి నేతలు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు


