రెంటచింతల: మండలంలోని మంచికల్లు గ్రామ సమీపంలోని బుగ్గవాగు రిజర్వాయర్లో సోమవారం ఒకేసారి మూడు మృతదేహాలు లభ్యంకావడంతో పల్నాడు ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముందు రెండు గుర్తుతెలియని మృతదేహాలు (గుర్తించలేని పరిస్థితి) కన్పించడంతో గురజాల ప్రభుత్వ వైద్యాధికారి సాయికరణ బుగ్గవాగు రిజర్వాయర్ వద్దే శవపంచనామ నిర్వహించి వస్తుండగా రాళ్లగుట్టపై మరో మృతదేహం పోలీసులకు కన్పించింది. మూడవ మృతదేహానికి మంగళవారం పంచనామా నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. రెండు మృతదేహాలు 40 సంవత్సరాల వయస్సు కలిగిన యువకులు, మరో మృతదేహం మహిళదిగా వైద్యులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ఏ పోలీసుస్టేషన్లో అయినా కొద్దిరోజులుగా ఎవరైన వ్యక్తులు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు వచ్చాయా అని పోలీసులు విచారిస్తున్నారు. బుగ్గవాగు రిజర్వాయర్లో కన్పించిన ఈ మూడు మృత దేహాలు ఎవరివి...ఏ ప్రాంతానికి చెందిన వారివి ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాయి అని విషయంపై విచారణ చేస్తున్నారు. మంచికల్లు వీఆర్వో పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు.


