పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన బాట
62 పీఏసీఎస్లలో 200 మంది ఉద్యోగులు ఆరు నుంచి వివిధ రూపాల్లో ఆందోళన పట్టించుకోని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అవస్థలు పడుతున్న రైతులు
సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన
సత్తెనపల్లి: చంద్రబాబు సర్కార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోంది. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఈనెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. జిల్లాలో ఉన్న 62 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పీఏసీఎస్) పని చేస్తున్న 200 మంది ఉద్యోగులు యూనియన్ పిలుపుమేరకు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపడుతున్నారు. అన్ని పీఏసీఎస్లకు వచ్చి పోయే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో పీఏసీఎస్ల ద్వారా ప్రతి రోజూ సుమారు రూ.20 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. నిరసనల కారణంగా ఆయా లావాదేవీలు నిలిచిపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 62 పీఏసీఎస్ల పరిధిలో సుమారు 1.20 లక్షల మంది రైతులు పీఏసీఎస్ల సేవలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగియడంతో పలువురు రైతులు పండించిన పంట ఉత్పత్తులు విక్రయించి డబ్బు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు పీఏసీఎస్లకు వస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్లో ఉండటంతో ఊసురుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రతి పీఏసీఎస్కు ప్రతి రోజూ సుమారు 15 నుంచి 20 మందికి పైగా రైతులు వచ్చి లావాదేవీలు జరుపుతుంటారు. ప్రతి పీఏసీఎస్లో నిత్యం రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి.
డిమాండ్లు ఇవే...
జిల్లాలో పీఏసీఎస్ ఉద్యోగులు హామీలు నెరవేరక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఈనెల 6 నుంచి వివిధ రూపాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాం. జనవరి 5న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రస్థాయిలో మహాధర్నా జరగనుంది. ప్రభుత్వం పీఏసీఎస్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు, ఉద్యోగుల వేదనను గుర్తించి డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన తప్పదు.
– ఆరాధ్యుల శ్రీనివాసరావు, పీఏసీఎస్ ఈయూ అధ్యక్షుడు, పల్నాడు జిల్లా


