జాతీయ లోక్ అదాలత్లో 1,590 కేసుల పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 1,590 కేసులు పరిష్కారం అయ్యాయి. కక్షిదారులకు రూ.4.84 కోట్లు పరిహారం కింద లభించింది. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయమూర్తులు నాలుగు బెంచ్లుగా లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్, చెల్లని చెక్కు, మనోవర్తి, గృహహింస, వాహన ప్రమాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి శరత్ బాబు, న్యాయ అధికారులు ఎన్.లావణ్య, ఆర్.ఆశీర్వాదంపాల్, ఎ.సలోమి, ఎం.గాయత్రి, న్యాయవాద సంఘ అధ్యక్షుడు ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్కు 150, తూర్పు కాలువకు 70, పశ్చిమ కాలువకు 45, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,666 క్యూసెక్కులు విడుదల చేశారు.
2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించాక మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో జరిగే ఈ వేడుక ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రిని లేదా ఉపముఖ్యమంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనవరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి. లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 574.10 అడుగులకు చేరింది. ఇది మొత్తం 266.8601 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు వెయ్యి, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,354, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 49,995 క్యూసెక్కులు వదులుతున్నారు.. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 49,995 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
జాతీయ లోక్ అదాలత్లో 1,590 కేసుల పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్లో 1,590 కేసుల పరిష్కారం


