గురువులకు గడ్డు పరీక్ష!
ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి సుప్రీం ఆదేశాలతో మల్లగుల్లాలు పడుతున్న ఉపాధ్యాయులు ఇది వరకే టెట్ క్వాలిఫైతో పోస్టుల్లో చేరిన వారికి ఉపశమనం ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలంటూ డిమాండ్ జిల్లాలో టెట్ రాయాల్సిన ఉపాధ్యాయులు 3,995 మంది
చదువు కోవాలా, చదువు చెప్పాలా
మినహాయింపు ఇవ్వాలి
సత్తెనపల్లి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2011వ సంవత్సరానికి ముందు చేరిన ఉపాధ్యాయులు సర్వీస్లో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన తీర్పు వెలువరించింది. రెండేళ్లలోపు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని గడువిచ్చింది. పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఐదేళ్లలో ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులకు మినహాయింపు నిస్తూ, ఒకవేళ పదోన్నతులు కావాలి అంటే మాత్రం టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది. ఈ నిబంధనలు ఉపాధ్యాయులను కలవరపెడుతున్నాయి.
రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలి..
జిల్లాలో మొత్తం 6,323 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 3,995 మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 2010 తర్వాత ఉపాధ్యాయ పోస్టులలో చేరిన వారంతా టెట్ ఉత్తీర్ణత సాధించి చేరిన వారే. 2010 కంటే ముందు కేవలం డీఎస్సీలో తమ ప్రతిభను చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారు 2027 ఆగస్టు 31వ తేదీలోపు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం వదులుకోవాలని వెల్లడించింది. దీంతో జిల్లాలో 3,995 మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఇన్ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ టెట్ ఉత్తీర్ణత సాధించాలని చెప్పడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఎన్సీటీఈ మార్గదర్శకాలలో సవరణ చేసే విధంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
టెట్ నోటిఫికేషన్ విడుదల...
రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెల 24వ తేదీన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీంతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి మినహాయింపు ఇస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు.
టెట్ పరీక్ష ఉపాధ్యాయుల పట్ల గుడిబండగా మారింది. దీనిని వెంటనే రద్దు చేయాలి. 25 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు చదివి రాయాలంటే విద్యార్థుల భవిష్యత్ ఏమౌతుందోనని భయంగా ఉంది.
– బంకా వాసుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ
2011 ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. ఏ ప్రభుత్వ శాఖకు లేని నిబంధనలు విద్యా శాఖకు మాత్రమే అమలు చేస్తున్నారు.
– మక్కెన శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఏపీటీఎఫ్
గురువులకు గడ్డు పరీక్ష!
గురువులకు గడ్డు పరీక్ష!


