
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నరసరావుపేట: గురజాల మాజీ శాసన సభ్యులు కాసు మహేష్రెడ్డిపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే తొలగించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు తీవ్ర స్థాయికి చేరాయని, ఇది సమాజానికి మంచిది కాదని అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
● బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి ఈ రోజు మీరు కర్రలతో మా మీద దాడులు చేస్తున్నారు, రేపు మా వాళ్లు గొడ్డళ్లతో వస్తారని ఆ పార్టీ దౌర్జన్యాలను నియంత్రించే ఉద్దేశంతో కాసు అన్నారని చెప్పారు. అంతమాత్రానికే అతనిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని మాట్లాడిన పవన్ కల్యాణ్పై, మంత్రి నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో బండ బూతులు మాట్లాడారని వారిపై ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు.
● పోలీసులకు ప్రమోషన్లు రావడం లేదని రాసిన సాక్షి ఎడిటర్పై అక్రమంగా కేసు పెట్టారని, ఇది దారుణమైన విషయం అన్నారు.
● రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా టీడీపీకి చెందిన ఒక వ్యక్తిపై కుంకుమ పడితే, ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకా ఏమైనా ఉందా అని జిల్లా ఎస్పీ ఆలోచన చేయాలన్నారు.
● ఆ కేసు పెట్టిన వ్యక్తి రెండు అడుగులు రోడ్డు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశాడన్నారు. కుంకుమ పడినందుకు కేసులు బుక్ చేస్తున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
● ఇటీవల తమ పార్టీకి చెందిన వరవకట్ట బుజ్జి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తే ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని 16 మందిపై కేసు బుక్ చేశారన్నారు.
● నిన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ మోర్ సెంటర్లో నడిరోడ్డు మీద కేక్ కట్చేసినా అనిపై కేసు ఎందుకు బుక్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.
● యూరియా దొరకట్లేదని మాట్లాడితే కేసులు పెట్టమని పోలీసు అధికారులు చెప్పటం దారుణమైన విషయం అన్నారు.
● ఇప్పటి వరకు కాసుపై గురజాల నియోజకవర్గానికి సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారని, ఇంకా ఎన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేశారో తెలియట్లేదని, తక్షణమే సుమోటోగా ఆ అక్రమ కేసులను విత్డ్రా చేసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసుపై నమోదు
చేసిన అక్రమ కేసును తక్షణమే
ఉపసంహరించుకోవాలి
వినాయక విగ్రహం ఊరేగింపులో
కుంకుమ పడిందని ఎనిమిది
మందిపై కేసు పెడతారా
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక
అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే
డాక్టర్ గోపిరెడ్డి ఆగ్రహం