
చేరికలు శూన్యం
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు లేక మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలే ఇందుకు ఉదాహరణ. పల్నాడు జిల్లావ్యాప్తంగా 179 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటివరకూ ఒకటో తరగతిలో కనీసం ఒక్క విద్యార్థి సైతం చేరకుండా ఉండటం విద్యారంగ చరిత్రలో ఇదే మొదటిసారి.
దీనావస్థలో ప్రభుత్వ విద్య
విలీనం పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలిపేయడం, మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు అంటూ ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు విద్యను దూరం చేయడం వంటి కారణాలతో ప్రాథమిక స్థాయిలో పునాది వేయాల్సిన ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు లేక పాఠశాలలు దీనావస్థలోకి వెళ్లిపోయాయి. ఈ విధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పరిశీలిస్తే ఒక పల్నాడు జిల్లాలోనే 179 పాఠశాలలు ఉండటం గమనార్హం.
వికటించిన ప్రయోగాలు
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో సంబంధిత పాఠశాలల్లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేసిన కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పేరుతో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేసింది. గ్రామంలోని వేర్వేరు కాలనీల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాలుగైదు ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటే పాఠశాల ఉండాలనే ప్రభుత్వ విధానంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే దూరమయ్య పరిస్థితులు ఏర్పడ్డాయి.
కిలోమీటర్ల కొద్దీ నడవలేక..
పాఠశాలకు వెళ్లిరావడం దూరాభారం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజూ కిలోమీటర్లు కొద్దీ నడిపించేందుకు ఇష్టపడక, ఆర్థిక భారమైనా స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రభావంతో గ్రామాల్లో మిగిలిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడే ప్రమాదం ఏర్పడింది. ప్రాథమిక పాఠశాలలకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చివేయడంతో విద్యార్థుల ప్రవేశాలు సైతం పడిపోతున్నాయి.
వైఎస్సార్ సీపీ హయాంలో సజావుగా..
ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతబడలేదు. ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చి, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా పాఠశాలలు సక్రమంగా కొనసాగే పరిస్థితులను నాడు కల్పించారు. అయితే నేడు కూటమి పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కోల్పోయే దుస్థితి ఏర్పడింది.
పల్నాడు జిల్లాలోని 179 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ వైఎస్సార్ సీపీ పాలనలో సజావుగా ప్రభుత్వ పాఠశాలలు