
వరుస దోపిడీలతో హడలెత్తిస్తున్న ఉత్తరాది దొంగల ముఠా
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వరుస రైలు దోపిడీలు ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణిస్తున్న దూరప్రాంత రైళ్లను సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్, చైన్ లాగడం వంటివి చేసి స్టేషన్ల మధ్య నిర్మానుష్య ప్రాంతాలలో దొంగలు ఆపుతున్నారు. బోగీలలో చొరబడి బంగారు నగలు, నగదు, ఫోన్లు వంటి విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. రైళ్లలో భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం, ఉన్నా కొందరి నిర్లక్ష్యంతో దొంగలు యథేచ్ఛగా ప్రయాణికులను దోచుకొని పారిపోతున్నారు. గతంలో క్రాసింగ్ కోసం ఆగినప్పుడు ప్రయాణికులను దోచుకునేవారు. రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు దొంగలు కిటికీలలో చేతులు పెట్టి లోపలున్న ప్రయాణికుల విలువైన వస్తువులను లాక్కెళ్లేవారు. ఇటీవల కాలంలో మరింత బరి తెగించి సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేస్తున్నారు. రైళ్లకు సిగ్నల్ దొరక్కుండా చేసి నిర్మానుష్య ప్రాంతంలో ఆగేలా చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా పిడుగురాళ్ల ప్రాంతంలో ఇదే తరహాలో దోచుకెళ్లారు.
సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేసి..
తాజాగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థను దుండగులు ట్యాంపరింగ్ చేయడంతో సిగ్నల్ పనిచేయక విశాఖ నుంచి చర్లపల్లి వెళుతున్న స్పెషల్ రైలు ఆగింది. ఇదే అదనుగా దొంగలు ఇద్దరు మహిళల నుంచి 50 గ్రాముల బంగారు గొలుసులు దోచుకున్నారు.
24 గంటలు గడవకముందే..
ఇది జరిగి 24 గంటలు గడవకముందే పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మల చెరువు స్టేషన్ సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఏకంగా రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపే వరకు వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కు విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ ఉండగానే స్లో అయింది. వెంటనే ఎస్ఐ వెంకటాద్రి తన సిబ్బందితో దొంగల వెంటపడ్డారు. విజిల్స్ వేయటం, లాఠీ శబ్దం చేయటం, లైట్లు వేయటంతో లైట్ ఫోకస్కు దొంగలు అప్రమత్తమై ట్రైన్ బోగీలో నుంచి దిగిపోయారు. దొంగలు రాళ్లు విసరడంతో ఎస్సై తన తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ శేషయ్య తన 303 గన్తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు పారిపోయారు. ప్రయాణికులకుగానీ, రైల్వే ఆస్తులకుగానీ ఎటువంటి నష్టం జరగలేదు. దొంగలు ఐదుగురు నుంచి ఏడుగురు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో 3 నెలల క్రితం కూడా ఓ దోపిడీ జరిగింది. గతేడాది ఆగస్టు నెలలో వరుసగా తుమ్మలచెరువు, నడికుడి ప్రాంతాలలో చైన్నె, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లలో దొంగలు దోచుకున్నారు.
హడలెత్తిస్తున్న ఉత్తరాది ముఠా
రైలు దోపిడీలు, దొంగతనాలు ఉత్తరాది దొంగల ముఠా పని అని జీర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన పార్థీ గ్యాంగ్, షోలాపూర్, మీర్జాపూర్, జూమ్కేడ్, బీడ్ తదితర ప్రాంతాలకు చెందిన నేరస్థులు రైళ్లలో ఇలా దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నేరాలు చేసే క్రమంలో వీరు చేస్తున్న రైల్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ రైల్వే భద్రతకు ప్రమాదకరంగా మారుతోంది. దీని వల్ల ప్రమాదాలు జరగడంతోపాటు సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని రైళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వరుస దోపిడీలతో హడలెత్తిస్తున్న ఉత్తరాది దొంగల ముఠా

వరుస దోపిడీలతో హడలెత్తిస్తున్న ఉత్తరాది దొంగల ముఠా