
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం
గుంటూరు ఎడ్యుకేషన్: బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రత్యేకమైన కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు జూలై మొదటి వారంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు.
● రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ బదిలీల చట్టం ద్వారా జరిగిన బదిలీల, ప్రమోషన్లలో ఉన్న అసంబద్దాలను సరిజేయడానికి యూటీఎఫ్ అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేసిందని, తద్వారా మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెలిపారు.
● రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించి, పెండింగ్లో ఉన్న డీఏలు, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం పనిచేసే సంఘంగా యూటీఎఫ్లో సభ్యులుగా చేరాలని కోరారు. ఈసందర్భంగా ఊరి బడిలో పిల్లల్ని చేరుద్దామని వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారి గయాసుద్దౌలా పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
నక్కా వెంకటేశ్వర్లు