
అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి
అమరావతి: ప్రపంచానికి పురాణాలను అందించింది వేదవ్యాస భగవానుడైతే ఆ పురాణాలను సామాన్యుడికి సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచించిన అభినవ వ్యాసుడు పురాణ ప్రవచన సార్వభౌముడు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి అని ప్రముఖ ప్రవచన కర్త నోరి నారాయణమూర్తి అన్నారు. శనివారం రాత్రి స్థానిక యోగాశ్రమంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి శతజయంతి వర్ష సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసభకు మల్లాది రామనాధశర్మ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా నోరి నారాయణమూర్తి మాట్లాడుతూ దేశ, విదేశాలలో పురాణప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మాత్రమేనన్నారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టువల్ల పురాణ ప్రవచన ప్రముఖుల్లో ప్రథములుగా గుర్తించబడ్డారన్నారు. నాటి కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పేరోజులనుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఆడిటోరియంలో చెప్పే వరకు సమారు 70 సంవత్సరాల మల్లాదివారి సుదీర్ఘ ప్రవచన ప్రయాణం సాగిందన్నారు.
● శనగవరసు రామ్మోహన శర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి అమరావతి ఆణిముత్యమన్నారు.
● మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ అమరావతిలోనే చంద్రశేఖరశాస్త్రి బాల్య విద్యాభ్యాసం గడవడంతోపాటు, తొలిరోజుల పురాణ ప్రవచనం ఇక్కడే చేసి, ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి మరోసారి వన్నె తెచ్చారన్నారు.
● ప్రముఖప్రవచనకర్త పుల్లాభట్ల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో శృంగేరి శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడిగా పురాణాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో భక్తిభావతత్పరతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడు చంద్రశేఖరశాస్త్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రా లలో ప్రవచనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రశేఖరశాస్త్రి అనటంలో అతిశయోక్తి లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మందాడి చలపతిరావు, మల్లాది రామచంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక ప్రసాద్లు మాట్లాడారు. ఈసభకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ప్రవచన కర్త నోరి నారాయణ మూర్తి