
ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు తల్లికి వందనం కూడా వర్తింపజేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె కమిటీ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా శనివారం నెహ్రూ బొమ్మ సెంటరులో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అరకొర జీతాలను అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ కార్మికులను పథకాలకు దూరం చేస్తు న్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, 12వ పీఆర్సీ అమలుకు అనుగుణంగా కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం అవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్, యూనియన్ నాయకులు రవి, రాఘవేంద్రరావు, శివ, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.