
గ్రావెల్ లారీలను అడ్డుకున్న జనసేన నాయకులు
చిలకలూరిపేట: అటవీ, అసైన్డ్ భూములను అక్రమంగా తవ్వి దోపిడీకి పాల్పడుతుంటే, సంబంధిత అధికారులు నిద్ర నటిస్తున్నారని... మామూళ్ల మత్తులో వారు జోగుతున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యడ్లపాడు మండలం వంకాయలపాడు, చెంఘీజ్ఖాన్పేట పంచాయతీల మధ్య అటవీ, అసైన్డ్ భూముల్లో కొంతమంది అక్రమ మైనింగ్కు పాల్పడుతూ గ్రావెవెల్ తరలించుకుపోతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు జనసేన నాయకులు ఆ ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రావెల్ తరలించుకుపోతున్న మూడు టిప్పర్ లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ తాము అవినీతిని అడ్డుకుంటామని వెల్లడించారు. ఆరు పొక్లెయిన్లు, 15 టిప్పర్ లారీలతో అటవీ, ప్రభుత్వ భూముల్లో భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలకు, దోపిడీకి పాల్పడుతున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేస్తే తహసీల్దార్ను పంపిస్తానని చెప్పారని, తహసీల్దార్కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తానని, సంబంధిత లారీల తాళాలు తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. లారీల తాళాలు తీసుకొని 3గంటలు వేచి చూసినా తహసీల్దార్ రాకుండా కేవలం ఒక వీఆర్వోను పంపించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అడ్డుకున్న మూడు టిప్పర్ లారీల తాళాలను మీడియా సమక్షంలో వీఆర్వోకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి సుభాని, నాయకులు ఖాదర్బాషా, మునీర్ హసన్, మేకల రామారావు, దరదాసుల శరత్, బాపన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల సహకారంతోనే
అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణ