
మేలు రకం విత్తనాలతో మిరపసాగు
నరసరావుపేట రూరల్: మేలు రకపు విత్తనాలతో మిరప సాగును రైతులు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. మిరప పంటపై జిల్లాలోని ఉద్యాన సహాయకులకు మున్సిపల్ సమావేశ మందిరంలో శనివారం శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన వెంకట్రావు మాట్లాడుతూ భూమిలో కర్భన శాతం పెంచే విధంగా జీలుగ, జనుము విత్తనాలను, పశువుల ఎరువును వేయాలని సూచించారు. నేలను లోతుగా దుక్కులను దున్నడం వలన చీడపీడలను నివరించవచ్చని తెలిపారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ జిల్లాలో సాగు చేసేందుకు అనువైన మిరప రకాలను తెలియజేశారు. ఎల్సీఏ–643 నల్లతామర పురుగు ఉధృతిని తట్టుకుంటుందని తెలిపారు. ఎల్సీఏ 334 ఎగుమతికి అనుమైన రకమని వివరించారు. ఎల్సీఏ 353,ఎల్సీఏ 625, ఎల్సీఏ 680,ఎల్సీఐ 684, ఎల్సీఏ 657 రకం విత్తనాలను రైతులు సాగు చేయాలని తెలిపారు. నారు పెంచేందుకు సెంటుకు 650గ్రాములు, ఎదబెట్టేందుకు ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం అవసరమవుతుదని తెలిపారు. సంకర రకాలైతే ఎకరానికి 80 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుందన్నారు. డిజిటల్ గ్రీన్ కో–ఆర్డినేటర్ మస్తాన్వలి మాట్లాడుతూ మిరప సాగు చేసే రైతులు ఈ–మిర్చి యాప్ను డౌన్లోడ్ చేసుకుని రైతు వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యవసాయ అనుబంధ సేవలకు చెందిన ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యాన అధికారులు ఎస్కె నబీరసూల్, మోహన్, సురేష్, అంజలిభాయ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు