కూటమి ‘పన్ను పోటు’ | - | Sakshi
Sakshi News home page

కూటమి ‘పన్ను పోటు’

Jun 14 2025 7:33 AM | Updated on Jun 14 2025 7:43 AM

ప్రజలపై భారం మోపబోమంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు తదితరులు అడ్డగోలుగా హామీలిచ్చారు. తీరా ఇప్పుడు గద్దెనెక్కాక ప్రజల నుంచి దొరికినకాడికి ఏ విధంగా వసూలు చేద్దామా.. అని ఆలోచిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పథకాల అమలు ఊసే ఎత్తని చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆస్తిపన్నును ఏకంగా ఇరవై శాతం వరకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది.

నరసరావుపేట: ఆస్తిపన్ను సవరణ పేరుతో జిల్లాలోని పురపాలక ప్రజలపై రూ.10.71 కోట్ల భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీలోగా జిల్లాలోని ప్రతి పురపాలక సంఘంలో ఇంటింటి సర్వే చేసి అదనపు కట్టడాలు, నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అధికారులు, సిబ్బందితో సచివాలయాలవారీగా బృందాలను ఏర్పాటు చేశారు.

33 బృందాలు ఏర్పాట్లు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం గత నెల 14వ తేదీన పురపాలక సంఘాలను ఆదేశిస్తూ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు ఆస్తిపన్ను వేయని, తక్కువగా పన్ను వేసిన ఆస్తులను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను వసూలులో 20 శాతం వరకు పెంచుకోవాలని ఆయా మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఈ మేరకు నరసరావుపేట పురపాలక సంఘంలో సచివాలయాల సంఖ్యను బట్టి 33 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో ఉన్న వార్డు సచివాలయాలవారీగా రెవెన్యూ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి.

రూ.కోట్లలో తప్పని భారం

నరసరావుపేట పురపాలక సంఘాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ నిర్మాణాలు కాకుండా సుమారుగా 28 వేల ప్రైవేటు అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.13.52 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. దీనిలో ప్రతి ఏడాది 90 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఈ మే నెలలో ఐదు శాతం రాయితీ కల్పించటంతో రూ.5.2 కోట్ల పన్ను పుర ప్రజలు చెల్లించారు. జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను డిమాండ్‌లో 20 శాతం పెంపుదల ఉండనుంది. ఇలా జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల ప్రజలపై రూ.10.71 కోట్ల భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

పురపాలక సంఘం అదనపు

వసూలు లక్ష్యం

(రూ.కోట్లలో)

నరసరావుపేట 2.85

చిలకలూరిపేట 2.39

సత్తెనపల్లి 1.36

వినుకొండ 1.23

పిడుగురాళ్ల 1.19

మాచర్ల 0.97

దాచేపల్లి 0.45

గురజాల 0.27

మొత్తం 10.71

సర్వే చేస్తున్న అధికారుల బృందాలు ఈ నెల 15తో ముగియనున్న సర్వే ప్రస్తుత పన్నుకు 20 శాతం అదనం

సర్వే బృందాలను ఏర్పాటు చేశాం

దీనిపై పురపాలక ఆర్‌వో శ్రీనివాసరావును వివరణ కోరగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆదేశాల మేరకు 33 బృందాలను ఏర్పాటు చేశాం. సర్వే చేస్తున్నాం. పన్ను వేయని అదనపు కట్టడాలు, నివాస గృహాల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు వంటి వాటిని గుర్తించి అదనంగా పన్ను విధించటం జరుగుతుంది. దీని ద్వారా 20 శాతం వరకు పన్ను మొత్తం పెంచుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు కృషి చేస్తున్నాం.

– శ్రీనివాసరావు, ఆర్‌ఓ, పురపాలక సంఘం

ఆస్తి పన్ను సవరణ పేరుతో ప్రజలపై రూ.కోట్లలో అదనపు భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement