
కుప్పడం పట్టు చీర జాతీయ అవార్డుకు ఎంపిక
బాపట్ల: చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని పేర్కొంది. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల కుప్పడంకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. చేనేత వృత్తినే నమ్ముకుని వందలాది చేనేత కుటుంబాలు బాపట్ల జిల్లా చీరాల పేరాలలో కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. సంప్రదాయ మగ్గాలపై చేనేత కార్మికులు కష్టపడి నేసిన కుప్పడం చీరలకు ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉండేది. యంత్రాల చొరబాటుతో కుప్పడం చీరల ఉత్పత్తి సన్నగిల్లిందని కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చేనేతల ఆశలు పునర్జీవం పోసుకున్నాయి. నేత వస్త్రాల ఉత్పత్తులకు చీరాల క్షీరపురిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం చీరాల కుప్పడం చీరలకు జాతీయస్థాయి అవార్డును ప్రకటించింది. జిల్లా కలెక్టర్ జూలై 14వ తేదీన అవార్డు అందుకోనున్నారు.