
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి
యడ్లపాడు: యోగా పట్ల మరింత అవగాహనను పెంచి, ప్రజలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించే లక్ష్యంతోనే యోగాంధ్ర –2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా జేసీ సూరజ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘యోగాంధ్ర – 2025’ ప్రచార కార్యక్రమం చారిత్రక పర్యాటక కేంద్రం కొండవీడుకోట ఘాట్రోడ్డులో శుక్రవారం ఉదయం నిర్వహించారు. అటవీ శాఖ పరిధిలో ఏపీ టూరిజం నిర్వహణలో పలు శాఖలు పాలుపంచుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల పాటు సాగిన ఈ యోగా శిబిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు.
ప్రతిరోజూ అభ్యాసం చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు కనీసం అరగంట యోగా చేయడం ఆరోగ్యానికి, మనస్సుకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. అధికారులు నిత్యం యోగా చేస్తే పనుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడంతోపాటు ఎక్కువ శక్తితో, ఉత్సాహంతో తమ విధులు నిర్వహించగలరని వివరించారు. వీటితోపాటు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారికి యోగా ప్రాముఖ్యతను వివరించాలని పిలుపునిచ్చారు. డీఎంహెచ్వో బి.రవి మాట్లాడుతూ రుగ్మతలు రూపుమాపేందుకు నిత్యం యోగా చేయాలన్నారు. డీఎఫ్వో మధులత మాట్లాడుతూ.. శారీరక, మానసిక సమస్యలకు యోగా ఒక అద్భుతమైన పరిష్కారం చూపుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం అధికారి గంగినేని నాయుడమ్మ, డీఎంహెచ్వో బి.రవి, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ, డీఆర్వో మురళి, పీడీ డ్వామా సిద్ధ లింగమూర్తి, డ్వామా ఏపీడీ హీరాలాల్, ఆర్డీవో మధులత, ఈఈ హౌసింగ్ బండారు శివలింగం, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, ఎంపీడీవో వి.హేమలతాదేవి, కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి, ఐసీడీఎస్ నాదెండ్ల సీడీపీవో జి.శాంతకుమారి, చిలకలూరిపేట డీఈ హౌసింగ్ సాంబయ్య, ఫారెస్టు కొండవీడు రేంజ్ అధికారి హరిణి పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా జేసీ సూరజ్ కొండవీడుకోటలో యోగా మహోత్సవం

నిత్య జీవితంలో యోగా భాగం కావాలి

నిత్య జీవితంలో యోగా భాగం కావాలి