
ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నాదెండ్ల, కలెక్టర్
తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి రానున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను శనివారం రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ నోడల్ అధికారి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, ఆర్డీఓ కె. శ్రీనివాసరావులు పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సుమారు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు ఆరు జిల్లాల నుంచి తరలివస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సభకు సీఆర్డీఏ పరిధిలోని 120 ఎకరాలు కేటాయించుకుని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్తి అయ్యాయని, 29వ తేదీ నుంచి ఎస్పీజి సిబ్బంది వచ్చిన తరువాత వారి ఆధ్వర్యంలో మిగిలిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. వాహనాల రాకపోకలకు నాలుగు ప్రధాన రహదారులు వున్నాయని, హైవే నుంచి వచ్చే వాహనాలకు సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే వెస్ట్రన్ బైపాస్ రోడ్డును కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి ఎక్కువ మంది వస్తారన్నారు. తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు వంటి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.