నరసరావుపేట: రైతులు డ్రోన్ సాంకేతికతను వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జేసీ ఆధ్వర్యంలో కిసాన్ డ్రోన్లకు ఎంపిక కాబడిన రైతు సంఘాల కన్వీనర్లు, కో–కన్వీనర్లు, వ్యవసాయ సంచాలకులు, డ్రోన్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. వారిని ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో అందజేస్తున్న డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు ఖాతా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డివిజన్, మండల స్థాయి అధికారులు రైతుసంఘాలకు తగిన సూచనలు ఇచ్చి సహాయపడాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాదికారి ఐ.మురళి మాట్లాడుతూ ఐదు నుంచి ఆరుగురు రైతులు ఒక సంఘంగా ఏర్పడి 80 శాతం సబ్సిడీతో అందజేసే కిసాన్ డ్రోన్కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో రెండు కంపెనీలైన డ్రాకో డ్రోన్ టెక్నాలజీ లిమిటెడ్ వారు రూ.9.80లక్షలు, విహంగా టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ రూ.9.81లక్షలకు డ్రోన్లు అందుబాటులో ఉంచారని, వాటిలో ఏదో ఒకటి రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలుత బ్యాంకు నుంచి 50శాతం రుణం లభిస్తుందని, అనంతరం డ్రోన్ కంపెనీ నుంచి మంజూరైన తర్వాత వ్యవసాయశాఖ ద్వారా రూ.7.84లక్షలు (80శాతం) సబ్సిడీ రైతుసంఘాల ఖాతాలకు జమచేయబడుతుందన్నారు. జిల్లాలో మండలానికి మూడు చొప్పున 84సంఘాలు లక్ష్యంగా అందజేయాలని మండల అధికారులకు నిర్ధేశించామని చెప్పారు. తొలుత మొదటి దఫాగా 43 సంఘాలకు సబ్సిడీతో డ్రోన్లు అందజేస్తామన్నారు. ఈసందర్భంగా డ్రోన్ ద్వారా అందజేసే పరికరాలను గురించి కంపెనీ ప్రతినిధులు వివరించారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బిజినెస్ మేనేజర్ జె.సుమన్, సహాయ వ్యవసాయాధికారి సీహెచ్ రవికుమార్, వ్యవసాయాధికారులు ప్రవీణ్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్
ధనుంజయ
డ్రోన్లు పొందే విధానంపై కలెక్టరేట్లో అవగాహన సదస్సు