
కప్పం కడితే రైట్ రైట్
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కూటమి సర్కార్ దోపిడీ శృతిమించి రాగానపడింది. గ్రానైట్ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున దండుకునేందుకు పచ్చనేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెల్లించే పన్ను సంగతి దేవుడెరుగు ముందు తమ సంగతి చూడమంటున్నారు. పన్ను ఎగనామం పెట్టినా ఫర్వాలేదు తమకు మాత్రం నెల మామూళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీచేశారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటినిచ్చేది లేదని బెదిరింపులకు దిగారు. పచ్చనేతల నెల మామూళ్లు ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే అధిక మొత్తంలో ఉండడంతో బయ్యర్లు బెదిరిపోతున్నారు. కప్పం చెల్లించి వితౌట్(టాక్స్ లేకుండా)లో గ్రానైట్ పంపే దానికంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించి దర్జాగా తీసుకెళ్లడమే మేలని వ్యాపారులు భావిస్తున్నారు.
చినబాబు కప్పం రూ.50 కోట్లు
బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల నుంచి నెలకు రూ.50 కోట్లు ఇవ్వాలని చినబాబు జిల్లా గ్రానైట్ మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హుటాహుటిన గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, బయ్యర్లతో సమావేశం పెట్టి వ్యవహారం చక్కబెట్టాలని రెండు జిల్లాల మైనింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో ఇటీవల గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీ యజమానులతో అధికారులు తొలుత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా మంత్రి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకరిద్దరికై తే కప్పం చెల్లించగలంకానీ పదుల సంఖ్యలో ఉన్న పచ్చనేతలందరికీ నెల మామూళ్లు ఇవ్వడం కుదరదని క్వారీ, పరిశ్రమల యజమానులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మీరడిగినంత మొత్తం కట్టలేమని, ఇలాగైతే వ్యాపారమే మానుకుంటామని మరికొందరు వ్యాపారులు ఏకంగా మంత్రికే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇలాగైతే బయ్యర్లు పలకలు తీసుకెళ్లేందుకు ఇష్టపడరని అదే జరిగితే వ్యాపారాలు మూత పడతాయని మరికొందరు వ్యాపారులు మంత్రికి వివరించినట్లు సమాచారం. అన్నీ విన్న మంత్రి పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించడం తప్ప తాను చేయగలిగిందేమీ లేదని వ్యాపారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, ప్రకాశం జిల్లా పరిధిలోని చీమకుర్తి ప్రాంతాల్లోని క్వారీలు, ఫ్యాక్టరీలపై దాడులకు దిగారు. పచ్చనేతల తీరుతో విసిగి పోయిన క్వారీ, పరిశ్రమల యజమానులు వితౌట్లో మైనింగ్ చేయడం దాదాపుగా మానుకున్నారు. కొందరు మంత్రి అనుచరులకు ముడుపులు చెల్లించి రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం. పచ్చనేతలకు కప్పం చెల్లించి వ్యాపారం చేయడం కంటే మానుకోవడమే మేలని కొందరు బయ్యర్లు వ్యాపారానికి తాత్కాలికంగా స్వస్తిపలికారు. ఇప్పుడు ఈ విషయం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. భూగర్భ గనులశాఖలో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
గ్రానైట్లో వసూళ్ల దందా చినబాబు నెల మామూళ్లు రూ.50 కోట్లు అద్దంకి, పర్చూరు పచ్చనేతలకుచెరో రూ.8 వేలు రూ.10 వేలు డిమాండ్ చేస్తున్న గురజాల పచ్చనేత తనకు రూ.8 వేలు కావాలంటున్న నరసరావుపేట నాయకుడు కప్పం కట్టకపోతే సేల్టాక్స్, లోకల్ పోలీసులను ఉసిగొల్పుతున్న వైనం ఫ్యాక్టరీ యజమానులతో మంత్రి గొట్టిపాటి సమావేశం వసూళ్ల విషయం మీరే చూసుకోవాలని ఆదేశం తలలు పట్టుకుంటున్న పరిశ్రమల యజమానులు, బయ్యర్లు పచ్చ దోపిడీపై సర్వత్రా ఆగ్రహం
శృతిమించిన పచ్చనేతల మామూళ్ల దందా
చినబాబు కప్పం వ్యవహారం పక్కనబెడితే స్థానిక పచ్చనేతలంతా గ్రానైట్పై పడ్డారు. గ్రానైట్ పాలీషింగ్ పలకలు వితౌట్(టాక్స్ లేకుండా)లో తీసుకెళ్లేందుకు లారీకి ఏఎమ్మార్ టోకెన్కు రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఏఎమ్మార్ ఇచ్చే టోకెన్ రూ.8 నుంచి రూ.10 వేలకు మించి ఉండదు. ఇది కాకుండా గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న పర్చూరు, అద్దంకి పచ్చనేతలకు వ్యాపారులు నెలకు చెరో రూ.8 వేలు కప్పం కడుతుండగా నరసరావుపేట పచ్చనేత రూ.8 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రానైట్ దందాకు ఆద్యుడైన గురజాల నేత తనకు రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండగా చిలకలూరిపేట నేత మాత్రం తనకు రూ.6 వేలు చాలని చెబుతున్నట్లు సమాచారం. మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 150 కి తగ్గకుండా పాలీ షింగ్ బండలు వితౌట్లో హైదరాబాద్కు తరలిపోతుండగా ఇందులో చిలకలూరిపేట, విజయవాడ మీదుగా హైదరాబాద్కు 30 లారీలు, నరసరావుపేట, గురజాల మీదుగా 120 లారీలు వెళుతున్నట్లు సమాచారం. వీరంతా ప్రతి లారీకి కప్పం చెల్లించాల్సిందేనని బయ్యర్లకు హుకుం జారీ చేశారు. ఏఎమ్మార్ టోకెన్తో పాటు పచ్చనేతలకు ఇస్తున్న కప్పంతో కలుపుకుంటే ఒక్కో లారీకి రూ.58 వేలు ఖర్చు వస్తోంది. వాస్తవంగా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించినా ఇంత మొత్తంలో ఖర్చురాదు. దీంతో బయ్యర్లు పచ్చనేతలు చెప్పిన మొత్తాన్ని చెల్లించలేమంటూ అడ్డు తిరిగినట్లు సమాచారం. ఒకవేల ఏఎమ్మార్ టోకెన్కు చెల్లించే మొత్తాన్ని రద్దు చేయిస్తే పచ్చనేతలు అడిగిన మేరకు కప్పం చెల్లిస్తామని బయ్యర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

కప్పం కడితే రైట్ రైట్