భువనేశ్వర్: రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు కుప్ప కూలాయి. ప్రధాన రహదారులపై చెట్లు విరిగి పడడంతో సాధారణ, వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖుర్దా, పూరీ, కటక్, బాలాసోర్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాతావరణం చల్లబడిన కాసేపటికే భారీ వర్షం కురిసింది. ఖొయిరా, సమూలియా, ఔపడా, సిర్, బహంగా ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కాల వైశాఖి తాండవంతో కటక్ జిల్లా బంకి మండలం డొంపొడా ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రభావంతో పలు చోట్ల చెట్టు నేలకొరిగాయి. ఆయా మార్గాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది కాల వైశాఖి ప్రభావిత ప్రాంతాలు సందర్శించి రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించి రహదారిపై రాకపోకలు పునరుద్ధరించారు.
పలు ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
ఈ నెల 10 వరకు రాష్ట్రంలో పలు చోట్ల మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో గంటకు 60 కిలో మీటర్ల వరకు వేగం పుంజుకున్న గాలులతో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు నారింజ మరియు పసుపు హెచ్చరికలను జారీ చేసింది.
నేటి వాతావరణం
సోమవారం మయూర్భంజ్, బాలాసోర్ మరియు భద్రక్ జిల్లాలకు నారింజ హెచ్చరిక జారీ అయింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. జాజ్పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, నువాపడా, బొలంగిర్, బర్గడ్, సోన్పూర్, సంబల్పూర్, ఝార్సుగుడ, సుందర్గఢ్, దేవ్గడ్, కెంజొహర్ జిల్లాలతో సహా పలు ఇతర జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా. పూరీ, ఖుర్దా, నయాగడ్, గంజాం, గజపతి, కలహండి, కంధమల్, అంగుల్, బౌధ్, రాయగడ, ఢెంకనాల్ వంటి జిల్లాల్లో గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు పుంజుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. చెట్ల నీడలో తలదాచుకోవడం తగదు. మెరుపులు, బలమైన గాలులు వీచేటప్పుడు ఇళ్లలోనే ఉండాలని భారత వాతావరణ విభాగం ప్రజలకు సూచించింది.


