జయపురం: పట్టణంలోని ప్రభుత్వ బీటెక్ కళాశాల స్థాపనపై సీఎం మోహన్చరణ్ మాఝితో చర్చిస్తానని కొరాపుట్ జిల్లా ప్రణాళిక బోర్డు అధ్యక్షుడు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ వెల్లడించారు. ఆదివారం ఆయన జయపురం వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని వెళ్లడించారు. కాగా పట్టణానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ట్రాక్టర్ ప్రమాదంలో యజమాని మృతి
పర్లాకిమిడి: ట్రాక్టర్ను డ్రైవరు బ్యాక్ చేస్తుండగా ఏమరపాటుతో యజమానికి ఢీకొనడంతో ఎం.నాగేశ్వరరావు(48) మృతి చెందారు. ఈ సంఘటన అనుకుండ గూడ గ్రామంలో కలకలం రేపింది. గుమ్మబ్లాక్ జీబ పంచాయతీ ఐదో మైలు వద్ద అనుకుండ గూడ గ్రామంలో ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. సొంత ట్రాక్టర్ను బ్యాక్ చేయమని డ్రైవర్ను ఓనరు ముద్దాని నాగేశ్వరరావు చెబుతుండగా, వెనుకన ఉన్న ఇంటి గోడ చూసుకోకపోవడంతో ట్రాక్టరు, గోడ మధ్య యజమాని నలిగిపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని పర్లాకిమిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పర్లాకిమిడి ఆదర్శ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైనట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


