ఆన్లైన్లో శ్రీ జగన్నాథుని మహా ప్రసాదం విక్రయం
● నిందితుడు అరెస్టు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిర్ పవిత్రమైన మహాప్రసాదం అమ్మకాన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం చేసినందుకు జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన బిల్డర్ను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్థానిక రసూల్ఘడ్లో ఉంటున్న డిస్పోజ్ పట్నాయక్గా దర్యాప్తులో ధ్రువీకరించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం నిందితుడు శ్రీ మహాప్రసాద్ అనే వెబ్సైట్లో ఒక ప్రకటనను ప్రసారం చేసి వివాదంలో చిక్కుకున్నాడు. పూరీ శ్రీ మందిరం పోటు (పాక శాల) నుండి భక్తులకు నేరుగా మహా ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నాడు. ఈ తప్పుదారి పట్టించే ప్రకటన భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పవిత్రమైన స్వామి మహా ప్రసాదాన్ని వాణిజ్యీకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దాఖలు అయిన ఫిర్యాదు మేరకు సైబర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్లైన్ అమ్మకాల ముఠాలో ఇతరులు పాల్గొన్నారా లేదా అనే దానిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
శ్రీ మందిరం ఆనంద బజారులో స్వామి మహా ప్రసాదాలు విక్రయిస్తారు. ఈ అంగడిలో మహా ప్రసాదాల ధరలకు అదుపు లేదు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. ధరల నిర్ధారణ, నియంత్రణ లేకపోవడంతో యదేచ్ఛగా ధరలు పెంచి భక్తులు, యాత్రికుల్ని దోచుకుంటున్నారు. సాధారణంగా భక్తులు కొనుగోలు చేసే అన్నం, పప్పు, కన్నికా (తీపి అన్నం) వంటి పదార్థాలతో కూడిన బుట్ట భోజనం రూ. 700 నుంచి రూ. 1,000 వరకు ధరలకు విక్రయిస్తున్నారు. ఇది సామాన్య యాత్రికునికి తలకు మించిన భారంగా పరిణమిస్తుందని సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది.


