5 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన స్థానిక లోక్సేవా భవన్లో 29వ మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. మత్స్య – పశు వనరులు, వ్యవసాయం, రైతుల సాధికారత, వాణిజ్య – రవాణా, గృహ నిర్మాణం – పట్టణాభివృద్ధి విభాగాలకు సంబంధించిన 5 ప్రతిపాదనలు ఆమోదించినట్లు ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా తెలిపారు.
మా శ్యామకాళీ సన్నిధిలో ఎమ్మెల్యే రూపేష్
పర్లాకిమిడి: పట్టణంలోని నెహ్రూ జంక్షన్ వద్ద కొలువైన మా శ్యామ కాళీ దేవిని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శనివారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్నాయక్, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, కౌన్సిలర్ నారాయణరావు బెహరా, సనోజ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు సెలవులు రద్దు
పర్లాకిమిడి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద తీరం దాటనున్న దృష్ట్యా దక్షిణ, ఉత్తర ఒడిశాకు ముప్పు ఉన్నట్లు అదనపు జిల్లా మాజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ తెలియజేశారు. ఈ తుపానుకు మంథా అని పేరు పెట్టారు. తుపాను వల్ల గంజాం, గజపతి, రాయఘడ, కొందమాల్ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ను జారీ చేశారు. ఈనెల 26 నుంచి 29 వరకూ పలు జిల్లాలకు సంభవించనున్న తుపాను దృష్ట్యా కలెక్టర్ ఈనెల 25 నుంచి 30 వరకూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు హెడ్క్వార్టర్లో ఉండాలని జీవో జారీ చేశారు.
నృత్య ప్రదర్శనలు
పర్లాకిమిడి: పట్టణంలోని రాజవీధిలో ఉన్న జగన్నాథ మందిర ప్రాంగణం వద్ద భక్తి పుష్పాంజలి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య కార్యక్రమాన్ని దేవీమఠం మహంత రామానంద దాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగి హరిమోహన్ పట్నాయిక్ అధ్యక్షత వహించగా, సెంచూరియన్ వర్సిటీ ఉద్యోగి ఉదయచంద్ర మహాపాత్రో, గోపినాథ మిశ్రా, బి.బి.మహంతి సహకారంతో జరిగింది. తొలుత కుమారి తపస్వీ కోరో ఒడియా శాసీ్త్రయ నృత్యంతో ప్రారంభమయ్యింది. అనంతరం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
ఇన్ఫోసిస్కు 117 మంది ఎంపిక
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఓడీలు, అధ్యాపకుల కృషి, విద్యార్థుల శ్రమ కారణంగా మంచి ఉద్యోగాలు సాధిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ హెచ్ఓడీ ఎం.సంతోష్కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఓడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తల్లికి అంత్యక్రియలు
చేసిన తనయ
సోంపేట: తల్లికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించిన ఘటన సోంపేట మండలం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి పార్వతి (46) అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె భర్త భాస్కరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కుమారుడు మానసిక రోగి. దీంతో కుమార్తె గౌరి పుట్టెడు దుఃఖంతోనే తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసింది.
5 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
5 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
5 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం


