
జోరువానలో పనులా?
రణస్థలం: రణస్థలంలో జరుగుతున్న ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా ఆదివారం ఓవైపు జోరుగా వర్షం పడుతున్నా పనులు కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పనులు చేస్తే నాణ్యత లోపించి కాలువలు ఎక్కువ కాలం మన్నిక రాదని స్థానికులు చెబుతున్నారు. హైవే అధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎచ్చెర్ల : ఎస్ఎంపురం గ్రామ సమీపంలోని తోటల్లో పేకాట ఆడుతున్న 8 మందిని ఎచ్చెర్ల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.21,130 నగదు, 7 సెల్ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై–2 ఎం.అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మందస: మందస మండల కేంద్రంలో శ్రీరాజా శ్రీనివాస స్మారక ఉన్నత పాఠశాల 125వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అన్ని బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు హాజరై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. తోటి స్నేహితులను కలుసుకుని సందడి చేశారు. ఐకానిక్ భవన నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మోహన్ ఆచార్యను సన్మానించారు. ప్రతి బ్యాచ్కు ప్రత్యేక షీల్డ్ను అందజేశారు.
విశ్రాంత డీఈఈ మృతికి సంతాపం
జి.సిగడాం: గతంలో వంశధార ప్రాజెక్టులో డీఈఈగా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన సువ్వారి జగదేశ్వరరావు(62) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన జి.సిగడాం మండలం వాండ్రంగి షిరిడీసాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. నీటిపారుదల శాఖలో ఏఈఈగా పని చేసిన అనంతరం వంశధార ప్రాజెక్ట్లో డీఈఈగా విధులు నిర్వహించి బదిలీపై పాయకరావుపేట వెళ్లారు. అక్కడ పని చేసి మార్చి 31న పదవీ విరమణ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఈలు డోల తిరుమలరావు, రవీంద్ర, మురళీకృష్ణ, వెంకటేశ్వరావు, సీఐ సింహాద్రినాయుడు, డీఈఈలు మన్మధరావు, రామ్మోహన్ , ఏఈఈలు, ప్రజాప్రతినిధులు బూరాడ వెంకటరమణ, సాకేటి నాగరాజు, కర్రి వైకుంఠేశ్వరరావు, గంటా అప్పారావు, రంగారావు, చిత్తిరి మోహన్లు నివాళులు అర్పించారు. వాండ్రంగిలో సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఐదో రోజైన ఆదివారం సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ఇంజినీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో 36 ప్రకారం రూ.26 వేలు వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరికీ తల్లికి వందనం, ఫీజు రీయంబర్స్మెంట్ అమలు చేయాలని, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ –ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుగుల గణేష్, ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, ఎ.శంకర్, యుగంధర్, ఎ.శేఖర్, ఎ.రాజశేఖర్, ఎ.జనా, డి.గణేష్, ఎ.లక్ష్మి, ఎన్.పార్వతి, ఆర్.ఈశ్వరమ్మ, ధనలక్ష్మి, పి.మల్లమ్మ, కె.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
లారీ క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్ మృతి
కాశీబుగ్గ: కోళ్లవ్యాన్ను అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందిన ఘటన పలాస సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పలాస మండలం గోదారిపురం గ్రామానికి చెందిన ఆసపాన దయాకర్ క్లీనర్తో కలిసి కోళ్ల వ్యాన్తో వెళ్తుండగా కోసంగిపురం–మొగిలిపాడు గ్రామాల మధ్య కటక్ నుంచి విశాఖపట్నం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సుశాంత్ నాయక్ (35) క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మరణించాడు. కోళ్లవ్యాన్ డ్రైవర్, క్లీనర్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాశీబుగ్గ ఎస్ఐ చంద్రరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జోరువానలో పనులా?

జోరువానలో పనులా?

జోరువానలో పనులా?