
మాజీ మంత్రి జాదవ మజ్జికి ఘన నివాళులు
కొరాపుట్: దివంగత మంత్రి జాదవ మజ్జి 75వ జయంతి ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రంలో అతని విగ్రహానికి అభిమానులు ఆదివారంగా ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ హయాంలో జాదవ మజ్జి గనుల శాఖా మంత్రిగా పని చేశారు. తదనంతరం బీజూ తనయుడు మాజీ ముఖ్యమంత్రి హయాంలో జాదవ మజ్జి కుమారుడు రమేష్ మజ్జి మంత్రిగా పని చేశారు. నివాళులర్పించిన వారిలో జాదవ మజ్జి తనయులు.. మాజీ మంత్రి రమేష్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ మజ్జి, బీజేడీ కార్యకర్తలు ఉన్నారు.
గజపతి పర్యాటకంపై
డాక్యుమెంటరీ విడుదల
పర్లాకిమిడి: స్థానిక రాజవీధి శ్రీజగన్నాథ మందిరం వద్ద అడపా మందిరం వద్ద ఆదివారం బహుడా రథయాత్ర పురస్కరించుకుని కళాకారులతో ఒడిస్సీ నృత్య కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ విచ్చేశారు. అనంతరం మోహానా బ్లాక్ కు చెందిన సుజ్ఞాణ్ సాగర్ ‘మొ గజపతి’ అనే పర్యాటకానికి సంబంధించిన డాక్యుమెంటరీ సీడీని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంటరీలో గజపతి పర్యాటక ప్రాంతాల గురించి సవివరంగా సుజ్ఞాన్ సాగర్ మీడియా ప్రతినిధి చిత్రీకరించారు. కార్యక్రమంలో ఉపాంత ప్రహారీ పూర్ణచంద్ర మహాపాత్రో, బినోద్ జెన్నా, సంగీత దర్శకులు రఘునాథ్ పాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ పాల్గొన్నారు.
పుట్టగొడుగులు తిని
ఐదుగురికి అస్వస్థత
కొరాపుట్: పుట్ట గొడుగులు కూర తిని ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి గంజా పర గ్రామ పంచాయతీ మరంగ్పాలిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి ముందు గడ్డిలో ఉదయం వేల పుట్ట గొడుగులు కనిపించాయి. వీటిని స్థానికులు సేకరించి వండుకొని తిన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత వారికి వాంతులు, తల తిప్పడం ప్రారంభం అయింది. వెంటనే గ్రామస్తులు వారిని రాయిఘర్ ప్రభుత్వ వైద్యశాలకి తరలించి చికిత్స అందించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన కువాన్ గొండో, బలరాం గొండో, దినేష్ గొండో, శివలాల్ గొండో, బుదురాం గొండోగా గుర్తించి. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండడగా.. మరో ముగ్గురు కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు.
నందపూర్ రథయాత్రకు అవాంతరాలు
కొరాపుట్: రాజరిక నేపథ్యం ఉన్న కొరాపుట్ జిల్లా నందపూర్ రథయాత్రలో బహుడా రోజు అవాంతరాలు ఏర్పడ్డాయి. రథం లాగడంలో దిశ మారి రథం ఒక ఇంటి వైపునకు దూసుకెళ్లి నిలిచిపోయింది. అనంతరం ప్రజలు చాలా శ్రమ పడి సవ్య దిశలోకి తెచ్చారు. మరి కొంత దూరం వెళ్లి మరో షాపు వద్ద మొరాయించింది. ప్రజలు ఎంత కష్టపడినా ముందుకు కదల్లేదు. దీంతో జేసీబీ తెచ్చి కదిలించారు. అంతలోనే భారీ వర్షం పడడంతో ప్రజలు చెల్లాచెదురయ్యారు. చివరకు ఎంతో కష్టం మీద రథం జగన్నాథ మందిరానికి చేరింది. ఈ ఘటనలో ఒక ఇంటి గోడ కూలి పోయింది. రథం నుంచి కొన్ని భాగాలు విడవడ్డాయి.

మాజీ మంత్రి జాదవ మజ్జికి ఘన నివాళులు