
తొక్కిసలాట
పూరీ శారదా బాలి వద్ద ..
భువనేశ్వర్:
పూరీలోని శ్రీ గుండిచా ఆలయం సమీపం శారదా బాలి ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పలువురు గాయ పడ్డారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది. మృతులను బొలొగొడొకు చెందిన 36 ఏళ్ల బసంతి సాహు, 78 ఏళ్ల ప్రేమకాంతి మహంతి, బలిపట్నకు చెందిన ప్రభాతి దాస్గా గుర్తించారు. తెల్లవారు జామున 4 గంటలకు రథాలపై ఏకాంత సేవ తెరలు (పొహుడా) తెరిచిన వెంటనే స్వామి వారి తొలి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల ప్రాణాలు ఇసుక (బాలి)లో కలిసి పోయాయి. ఈ దర్శనం కోసం భక్తులు భారీగా గుమిగూడి ఉండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చారుమళ్ల కలపతో నిండిన ట్రక్కు అకస్మాత్తుగా జనంలోకి ప్రవేశించింది. దర్శనం కోసం ఎగబాకుతున్న జనం ప్రాణ రక్షణ కోసం అకస్మాత్తుగా చెల్లాచెదురయ్యే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో 500 మందికి పైగా భక్తులు శారదా బాలిపై పరిచిన ప్లాస్టిక్ చాపలపై కూర్చుని ఉండగా కలప రవాణా ట్రక్కు దూసుకుని వచ్చింది. ఈ దూకుడులో 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
సెక్యూరిటీ గార్డు ఉండి ఉంటే..
దుర్ఘటన సమయంలో రథం దగ్గర సెక్యూరిటీ గార్డులు లేరు. భద్రతా ఏర్పాట్లు ఉండి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని తొక్కిసలాటలో మృతి చెందిన బొలొగొడొ ప్రాంతానికి చెందిన బసంతి సాహు భర్త వాపోయాడు. సుమారు గంటన్నర సేపు సహాయం కోసం ప్రాధేయపడి నీరుగారి పోయామని భోరుమన్నాడు.
క్షమాపణ కోరిన ముఖ్యమంత్రి
శారదా బాలి ప్రాంగణంలో రథాలపై దేవుళ్ల దర్శనం సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం తెలియజేశారు. ఈ సంఘటనకు తాను, తన ప్రభుత్వం జగన్నాథ ప్రేమికులందరికీ క్షమాపణలు కోరుతున్నామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభ్యర్థించారు. ఈ ఆపత్కాలంలో దారుణమైన నష్టాన్ని భరించే శక్తిని మహాప్రభు జగన్నాథుడు బాధిత భక్తులకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. భద్రతా నిర్లక్ష్యంతో ఈ ఘోరమైన సంఘటన జరిగినట్లు ఆరోపణ. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించి బాధ్యులైన వారి వ్యతిరేకంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకనేందుకు ఆదేశించారు.
ముగ్గురు భక్తులు మృతి
పలువురికి గాయాలు
ఈ విచారకర సంఘటనపై విపక్ష నేత నవీన్ పట్నాయక్ మృతుల కుటుంబీకులకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జన సమూహం నిర్వహణకు ప్రభుత్వ ఏర్పాట్లు లేకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుందని, తొలి రోజున శ్రీ జగన్నాథుని నంది ఘోష్ రథం కదలకపోవడాన్ని జగన్నాథుని ఇచ్ఛగా పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఈ విచారకర సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని అడపా విజే, స్వర్ణ అలంకారం, నీలాద్రి విజే మును ముందు ఘట్టాల్లో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అవాంఛనీయ సంఘటనలు నివారించడంలో పూచీదారితనంతో వ్యవహరించాలని నవీన్ పట్నాయక్ తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూరీ శారదా బాలి ఘటనలో ముగ్గురు మృత్యు సంఘటనతో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా శారదా బాలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, కలెక్టర్ ప్రతిస్పందించారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని పూరి ఎస్పీ తెలిపారు. శారదా బాలిలో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో 3 మంది భక్తులు మరణించారు. ఆరుగురు గాయపడినట్లు ఈ అధికారులు తెలిపారు. పొహుడా తెరిచిన తర్వాత అకస్మాత్తుగా రద్దీ ఏర్పడి ఈ విషాదం చోటు చేసుకుందని కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు.
ఈ నిర్లక్ష్యం క్షమించరానిది
– నవీన్ పట్నాయక్