
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
● మంత్రి కృష్ణ చంద్ర పాత్రో
భువనేశ్వర్: రాష్ట్రంలో రబీలో రైతులు పండించిన ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన రైతుల నుంచి సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో అధికారులను ఆదేశించారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సెలవు దినాల్లో కూడా పని చేయాలని ఆదేశించారు. స్థానిక రాష్ట్ర ఆహార సరఫరా సంస్థను ఆదివారం సందర్శించిన సందర్భంగా మంత్రి రబీ ధాన్యం సేకరణ పురోగతిని అధికారులతో చర్చించి సమీక్షించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశలో ఉన్నందున లోపాలు లేకుండా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో మంత్రి వివిధ జిల్లా కలెక్టర్లు, రైతులతో కూడా చర్చించారు. రాష్ట్ర పౌర సరఫరా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.సుదర్శన్ చక్రవర్తి ధాన్యం సేకరణ పురోగతిని వివరించారు. పలువురు సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
మజ్జిగౌరి దర్శనానికి భక్తుల తాకిడి
రాయగడ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్లలో అమ్మవారి దర్శనార్ధం వేచిఉన్న భక్తులకు దర్శనం అయ్యేసరికి సాయంత్రం పట్టింది. దీంతో భక్తులు విసుగెత్తి మందిరం ప్రాంగణంలో ఉన్న చెట్టు వద్ద మొక్కుబడులను తీర్చుకుని తిరిగి వెళ్లడం కనిపించింది. ఇదిలాఉండగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు రావడంతో మందిర ప్రాంగణం కిక్కిరిపొయింది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మందిర నిర్వాహకులు తగు చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు అవస్థలు ఎదుర్కొన్నారు.
‘పనులు చేయకుండా డబ్బు స్వాహా’
జయపురం: మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజనలో పనులు చేయకుండా రూ.12 లక్షల అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతిపై దర్యాప్తు జరపాలని జయపురం సబ్డివిజన్ బొరాగుమ్మ సమితి నారిగాం పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ పంచాయితీ ఉన్నతికోసం రూ.12 లక్షలు మంజూరు కాగా పనులు జరుపకుండానే స్వాహా చేశారని ఆరోపిస్తున్నారు. ఆ డబ్బుతో ఏయే పనులు చేపట్టారో తెలీడం లేదని నారిగాం మాజీ సర్పంచ్ ఆరోపించారు. మాజీ సర్పంచ్ నేతృత్వంలో నారిగాం ప్రజలు బొరిగుమ్మ బీడీఓను కలసి అవినీతిపై శనివారం ఆరోపించారు. మనొరెగ పథకంలో నారిగాం పంచాయతీ బటిగుడలో ఫీల్డ్ కాలువ నిర్మాణానికి రూ.6 లక్షలు మజూరు కాగా ఖంగారుతోట ప్రాంతంలో ఫీల్డ్ కాలువ కొరకు మరో రూ. 6 లక్షలు మంజూరు అయ్యాయని నారిగాం మాజీ సర్పంచ్ లక్ష్మణ వెల్లడించారు. అయితే ఆ రెండు పనులు చేయకుండా డబ్బు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఆ రెండు కెనాల్లు తవ్వేందుకు కూలీలకు దాదాపు రూ.3 లక్షలు కూలి డబ్బులు ఇచ్చారని, అయితే కెనాల్ పనులు జరగలేదని ఆరోపించారు. ఈ అవినీతిలో సర్పంచ్, పీఈఓ, ఏడీఈఓ, రామపాత్రొపుట్ పూజారిలు మమేకమై ఉన్నట్లు ఆరోపించారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆరోపించారు. శనివారం బీడీఓకు ఆరోపణల పత్రాన్ని అందజేశామని పేర్కొన్నారు. ఈ అవినీతిపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి