
వీడిన రామగిరి హత్య కేసు మిస్టరీ
● ఇద్దరు నిందితులు అరెస్టు ● హత్యకు దారితీసిన భూవివాదం
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి రామగిరిలో ఈ నెల 23వ తేదీన కడమాసింగి గ్రామానికి చెందిన రామచంద్ర నాయక్ (35) దారుణ హత్యకు గురయ్యారు. శవానికి రాళ్లను కట్టి నువాసాహి డ్యాంలో విసిరేశారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న రామగిరి పోలీసులు హత్యంతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. రాణిపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జ్యోతింద్ర పండా సమక్షంలో నిందితులను ఆదివారం ప్రవేశపెట్టి విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి తన తమ్ముడు రామచంద్ర నాయక్ కనబడుట లేదని అన్నయ్య బరున్ కుమార్ నాయక్ రామగిరి పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్య లు చేపట్టినప్పటికీ రామచంద్ర నాయక్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే కడమాసింగి గ్రామానికి సమీపంలో నువాసాహి డ్యాంలో మృతదేహం ఉన్నట్టు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీసి వాకబు చేయగా అది రామచంద్రనాయక్దిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతుని మెడమీద, తలపై బలమైన గాయాలు ఉండడంతో హత్యగా పోలీసు లు నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితులైన అనాఘా గ్రామానికి చెందిన అతుల్ ప్రసాద్ బెహార్ దోళాయి, కరంజపడ గ్రామానికి చెందిన బిశ్వభాను ప్రధాన్ను రామగిరి పోలీసులు అరెస్టు చేసి మర్డర్ సీనును రీక్రియేట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో తేలిందేమంటే ఒక భూవివాదం విషయమై రామచంద్రనాయక్ను హత్య చేయాలని నిందితులు పన్నాగం పన్నినట్టు తెలియవచ్చింది.
హత్య ఎలా చేశారంటే ..
తొలుత రామచంద్ర నాయక్ను తలపై రాళ్లతోకొట్టి, తరువాత గొడ్డలితో మెడపై వేటువేశారు. తరువాత పొదల్లో శవాన్ని దాచిపెట్టారు. అనంతరం ఏం చేయాలో పాలుపోక అతుల్ ప్రసాద్ దళబెహారా తన మామయ్యను పిలిచి సలహా అడిగాడు. జూన్ 22వ తేదీ రాత్రి సమీపంలో మృతదేహాన్ని నువాసాహి డ్యాంకు తీసుకెళ్లి శవానికి రాళ్లు కట్టి విసిరివేసి పారిపోయినట్టు నిందితులు దర్యాప్తులో అంగీకరించినట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. 25వ తేదీన డ్యాంలో తేలిన శవానికి వైద్యులు పోస్టుమార్టం చేయడం.. రామచంద్ర నాయక్ తలపై బలమైన గాయాలు ఉన్నట్టు పీఎం రిపోర్టులో డాక్టర్లు ధ్రువీకరించారు. నిందితులు మృతుని మైబైల్ను కూడా ధ్వంసం చేసినట్టు ఎస్పీ చెప్పారు. అయితే డ్యాం వద్ద దొరికిన మొబైల్ను డాటా తీసి పోలీసులు నిందితుల నంబర్లు సేకరించి మొబైల్ ట్రాక్తో పట్టుకోగలిగారు. నిందితుల వద్ద నుండి ఒక గొడ్డలి, మెడకు చుట్టిన తువ్వాలు, రాళ్లు, తాడును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా వెల్లడించారు. కేసు దర్యాప్తులో సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితాబ్ పండా, ఓఐసీ డి.గజపతి దొర, ఏఎస్సై సంతోష్ కుమార్ బెహరాలు కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు.