
పతిత పావనుడికి పూజలు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో కుడ్య ప్రతిమ పతిత పావనుడిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. రత్నవేదికపై కొలువుదీరిన మూల విరాటు అస్వస్థతతో తెరమరుగు కావడంతో జగన్నాథుని స్థానంలో అనంత నారాయణ్ చిత్రపటం నిత్య పూజలు అందుకుంటున్నాడు. మూల విరాటుల సహజ దర్శనం పునరుద్ధరించేంత వరకు పతిత పావనుని ఇలా దర్శించుకోవడం నిరవధికంగా కొనసాగుతుంది.
పేదలకు నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలో గల నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ మహిళలకు ఉచితంగా నిత్యావసరాల వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. అన్నలక్ష్మీ పథకం కింద ప్రతి నెల బియ్యం, నూనె, బంగాళాదుంపలు, కందిపప్పు తదితర వస్తువులను పంపిణీ చేస్తున్నామని ట్రస్టు నిర్వాహకులు ఎం.నళిని తెలియజేశారు. ఇదిలాఉండగా ఈ సారి నిత్యవసరాల వస్తువులతో పాటు మామిడి పళ్లు, బిస్కెట్, రొట్టెలను పంపిణీ చేశామని ఆమె తెలిపారు. తిరుపతిలో గల నవజీవన్ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య ప్రతి నెల నిరుపేదలకు అన్న లక్ష్మీ పేరిట నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారని, అదేవిధంగా రాయగడలో గల ట్రస్టు ఆధ్వర్యంలో ఎందరినో చదివిస్తున్నారని తెలిపారు.
చంద్రపూర్లో ఇళ్ల పట్టాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో 35 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను శుక్రవారం పంపిణీ చేశారు. అదనపు తహసీల్దార్ ఆశీష్ కుమార్ ప్రధాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రహి, సిబ్బంది మోతీలాల్ సామల్ తదితరులు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు. లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
లారీ బోల్తా
రాయగడ: కలహండి జిల్లా భవానీపట్నం నుంచి రాయగడకు అల్యూమిన పైపులతో వస్తున్న లారీ జిల్లాలోని అంబొదల సమీపంలో శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలోని పైపులు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న అంబొదల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్, హెల్పరు సురక్షితంగా బయటపడ్డారు.
తమ్ముడిపై దాడి ఘటనలోఅన్న అరెస్టు
మల్కన్గిరి: కోరుకొండ సమితి బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో రాస్స్బేఢ పంచాయతీ పల్లంగూడలో ఈ నెల 8న భూమి విషయమై తమ్ముడు తిరుపతి ముదిలిని బాణంతో గాయపరిచిన అన్నహరి ముదిలిని బలిమెల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ తెలిపారు. తిరుపతి ప్రస్తుతం బరంపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పతిత పావనుడికి పూజలు