
రాష్ట్రం ఆదర్శం: సీఎం
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
మహిళా సాధికారతలో..
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సాధికారతతో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలపరిచేందుకు కట్టుబడి ఉందని సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. మహిళల స్వావలంబన కోసం సంకల్పించిన సుభద్ర యోజన విజయవంతం కావడం ఒక ప్రధాన ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని కటక్ నగరం బలియాత్ర గ్రౌండులో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నారీ శక్తి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళలను గౌరవించడం రాజకీయ శిక్షణలో తొలి అంశంగా పేర్కొన్నారు. ఒడిశా నారీ శక్తిని అత్యుత్తమ శక్తిగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. లక్షాధికారి సోదరి (లఖ్యపతి దీదీ) ఆవిష్కరణలో ఒడిశా ప్రస్తుతం భారత దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 16 లక్షలకు పైగా లక్షాధికారి సోదరిలను సృష్టించడం మహిళా సాధికారతకు నిలువెత్తు తార్కాణంగా అభివర్ణించారు.
సుభద్ర యోజన ఒడిశా చరిత్రలో అతిపెద్ద మహిళా సంక్షేమ కార్యక్రమమని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా సంప్రదించి సమగ్ర సమాచారంతో వాస్తవ లబ్ధిదారుల్ని పరిగణనలోకి తీసుకుని పథకం ప్రయోజనం చేరదీయడం విశేషమన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ మహిళల్ని చైతన్యపరచి పథకంలో చేర్చడం ప్రభుత్వం దృఢ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు.
ఏడాది పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా స్వయం సహాయక బృందాలకు రూ. 3 వేల 695 కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను కల్పించాయని. రాష్ట్ర చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్గా పేర్కొన్నారు. 3.07 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు రుణాలపై రూ. 300 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించి వారి ఆర్థిక కలలను సాకారం చేయడంలో ప్రభుత్వం వారధిగా నిలిచిందన్నారు. ఈ ఏడాది మహిళల కోసం రూ. 89,861 కోట్ల నిధుల్ని బడ్జెట్లో కేటాయించి మహిళలకు పట్ట ప్రభుత్వ నిబద్ధత చాటుకుందని, మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా ఒడిశా ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ తన ప్రసంగంలో, మహిళా శక్తి అభివృద్ధి చెందిన, సంపన్నమైన, గర్వించదగిన ఒడిశా ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ సమానత్వం, శ్రేయస్సు, పురోగతి రాష్ట్రంగా ఒడిశాను నిర్మించాలనే సంకల్పానికి ఈ కార్యక్రమం తొలి వేదికగా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది సరికి రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో లక్షాధికారి సోదరి, ప్రతి పంచాయతీలో కోటీశ్వర మహిళల్ని ఆవిష్కరించడం తథ్యమని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ అమలు చేసిన పోషణ్ అభియాన్లో అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రంలోని వివిధ లిఖిత, ఫొటో చిత్రాలతో కూడిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి, ఇతర అతిథులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత శాఖ ఆధ్వర్యంలో విశేష కృషి చేసిన మహిళలను ముఖ్యమంత్రి సత్కరించారు.
కటక్ లోక్ సభ సభ్యుడు భర్తృహరి మహతాబ్, జగత్సింగ్పూర్ లోక్ సభ సభ్యుడు బిభు ప్రసాద్ తొరై, కటక్ నియోజక వర్గం శాసన సభ సభ్యుడు ప్రకాష్ సెఠి, బొడొంబ నియోజక వర్గం శాసన సభ సభ్యుడు విజయ్ డాల్బెహెరా, నియాలి నియోజక వర్గం శాసన సభ సభ్యుడు అభిషేక్ మల్లిక్, మహాంగా నియోజక వర్గం శాసన సభ సభ్యుడు శారద ప్రసాద్ ప్రధాన్, జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే, మహిళా సాధికారత శాఖ ప్రముఖ కార్యదర్శి శుభ శర్మ, డైరెక్టర్ మోనిషా బెనర్జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూస్రీల్

రాష్ట్రం ఆదర్శం: సీఎం

రాష్ట్రం ఆదర్శం: సీఎం

రాష్ట్రం ఆదర్శం: సీఎం

రాష్ట్రం ఆదర్శం: సీఎం