
40 మందికి శిరోముండనం
కులాంతర వివాహం..
రాయగడ: నేటి ఆధునిక ప్రపంచంలోనూ ఇంకా అనేక చోట్ల మూఢ నమ్మకాలు కొనసాగుతునఆనయి. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో యువతి కుటుంబీకులు 40 మంది శిరోముండనం చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా కాసీపూర్ సమితి గొరక్పూర్ పంచాయతీలో ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, వేరే షెడ్యూల్ తెగకు చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి యువతి తరఫు బంధువులు, కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న యువ జంట తమ బంధువులు, కుటుంబీకులను కలసి ఆశీర్వాదం తీసుకునేందుకు గురువారం స్వగ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఊరికట్టుబాట్లను కాదని కులాంతర వివాహం చేసుకున్నందుకు శిక్ష విధించారు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబీకులను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే యువతి బంధువులు, కుటుంబీకులు శిరోముండనం చేసుకోవడంతో కర్మకాండలను నిర్వహించి మూగజీవాలను బలి ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు యువతి కుటుంబీకులు అంగీకరించారు. 40 మంది శిరోముండనం చేసుకుని మూగజీవాలను బలిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా వారిని తిరిగి కులంలో కలుపుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి సమాచారం లేదు.