కొరాపుట్: ఆధునిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో గిరిజనులు మూఢ విశ్వాసాలు, నిబంధనలు వీడటం లేదు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కొడింగా పోలీస్స్టేషన్ పరిధి లోని బంకులి గ్రామానికి చెందిన 15 కుటుంబాల పెద్దలు నబరంగ్పూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చట్టపరంగా ఉన్న తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, దీనిపై న్యాయ పోరాటానికి దిగడంతో కక్ష కట్టి తమ 15 కుటుంబాలకు చెందిన 75 మందిని సామాజిక బహిష్కరణ చేశారని వాపోయారు. గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడరని, దుకాణాలలో వస్తువులు విక్రయాలు చేయడం లేదని, బోర్ల వద్ద నీరు పట్టుకోనివ్వడం లేదని, కనీసం పశువులను కూడా చెరువుల వద్దకు రానివ్వకపోవడంతో నాలుగు రోజులుగా పశువులు ఆకలితో అలమటిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. తమ పిల్లలను కూడా ఇతర పిల్లలతో ఆడనివ్వడం లేదన్నారు. గ్రామస్తులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రు.500 జరిమానా విధిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కొడింగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదన్నా రు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నా త్రిపాఠి బాధితులను జిల్లా కేంద్రానికి రప్పించి ఎస్పీ ఫిర్యాదు చేయించారు. దీంతో ఎస్పీ సందీప్ సంపత్ తీవ్రంగా పరిగణించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, మున్నా త్రిపాఠి మీడియాతో మాట్లాడు తూ ఇటువంటి సంస్కృతిని ఆదిలోనే నిలిపి వేయాలన్నారు. లేదంటే ప్రతి గ్రామంలో బలవంతులు చట్టం తమ చేతిలోకి తీసుకొని పేదలను పీడిస్తారన్నారు. తక్షణం పోలీసు బలగాలు గ్రామానికి చేరుకొని నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశా రు. త్వరలోనే ఆ గ్రామాన్ని సందర్శిస్తామని త్రిపాఠి పేర్కొన్నారు.