శ్రీకాకుళం కల్చరల్: దాతలు కావాలి.. రక్త దాతలు ముందుకు రావాలి. జిల్లాలో రక్తల నిల్వలు నానాటికీ తక్కువైపోతున్నాయి. దాతలు ముందుకు రాకపోతే గర్భిణుల దగ్గర నుంచి ప్రమాద బాధితుల వరకు చాలా మంది ప్రాణాపాయ స్థితిలో పడతారు. రక్తదానంపై అవగాహన విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జిల్లాలో రెడ్క్రాస్తో పాటుగా ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో 3 ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో బ్లడ్బ్యాంకులు ఉన్నాయి. వాటన్నింటి ద్వారా రక్త సేకరణ ఏడాదిలో కేవలం 16వేల యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జిల్లాకు దాదాపు 60వేల యూనిట్లు అవసరం ఉంటుంది. దీనిపై రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని చెప్పారు. తమ బ్లడ్బ్యాంకులో కూడా కూడా రక్తం అందడం కష్టంగా ఉందన్నారు.
అపోహలు వద్దు..
● చాలా మంది రక్తదానం అంటే భయపడతారు. దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. ● రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే సేకరిస్తారు. ● సాధారణంగా మనిషిలో సరాసరి 5లీటర్ల నుంచి 6లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. సుఖప్రసవంలో తల్లి 700 మిల్లీలీటర్ల రక్తం కోల్పోతుంది.
నేడు రక్తదాతల దినోత్సవం
రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రక్తదానంపై ఆవశ్యకత కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు.
అపోహలు వదలండి
రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి. ఎవరైనా రక్తదానం చేయవచ్చు. ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరం. దాన్ని గుర్తించండి.
– పి.జగన్మోహనరావు, చైర్మన్, రెడ్క్రాస్
సాటి మనిషిని కాపాడాలనే..
నేను 49 సార్లు రక్తదానం చేశాను. ఏటా ఆగస్టు 15, మే 1, రిపబ్లిక్ డే, డిసెంబరు 25 పుట్టిన రోజున ఇస్తుంటాను.
– కేకేవీ పురుషోత్తమరావు(కల్యాణ్),
విశ్రాంత మెడికల్ రిప్రజెంటేటివ్, శ్రీకాకుళం
ప్రతి మూడు నెలలకు ఇస్తాను..
నేను ప్రతి మూడు నెలలకు ఓ సారి రక్తదానం చేస్తుంటాను. మొదట్లో నాకూ భయం ఉండేది. మా మేనేజర్ను చూసి స్ఫూర్తి పొందాను. రెడ్క్రాస్ పలుసార్లు అవార్డులు, సత్కారాలు కూడా చేశారు.
– సీహెచ్ రమణమూర్తి, శ్రీకాకుళం
జిల్లాకు ఏడాదికి దాదాపు 60వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ సేకరిస్తున్నది మాత్రం కేవలం 16 యూనిట్లే. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడం చిటికెలో పని. కానీ ఎందుకనో ఆ పని జరగడమే లేదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేస్తే కొరతను ఇట్టే అధిగమించవచ్చు. కానీ అవగాహన లేమి, భయం, సమాచార లోపం కారణంగా రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ భయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందకుండాపోతోంది.
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
జిల్లాలో తగ్గుతున్న రక్త నిల్వలు
దాతలు ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థల పిలుపు
ఎవరు రక్తదానం చేయవచ్చు..
కాసింత దయాగుణం.. మరికాసింత ఆరోగ్యం.. ఈ రెండూ ఉంటే చాలు.. 18–60 ఏళ్ల వారెవరైనా 45 కిలోలకు పైగా బరువు ఉండి, 12 పాయింట్లు హిమోగ్లోబిన్ ఉంటే ఎంచక్కా రక్తదానం చేయవచ్చు.
ఆర్తులను కాపాడుదాం
ఆర్తులను కాపాడుదాం
ఆర్తులను కాపాడుదాం