ఇదేం మద్దతు?
● అరకొరగా ధాన్యం మద్దతు ధర పెంపు
● క్వింటాల్కు రూ.69 మాత్రమే
పెంచడంపై రైతుల్లో అసంతృప్తి
● అమాంతంగా పెరిగిన సాగు ఖర్చులు
నరసన్నపేట:
కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్కు 14 రకాల పంటలకు ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ప్రధాన పంట వరితో పాటు పత్తి, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, రాగి, మొక్కజొన్న, పెసలు, కంది, మినుములకు కనీస మద్దతు ధర పెంచింది. మిగిలిన పంటల ధరల సంగతి అటుంచితే వరికి ప్రకటించిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలతో పాటు ఎరువులు, కూలీలు తదితర ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరల పెంపులేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో వరి ప్రధాన పంట. సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి ఎకరాకు సరాసరి 25 బస్తాల వరకూ వస్తుంది. అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఈ పంటకు మద్దతు ధర రూ.69 మాత్రమే పెంచడం పట్ల అన్నదాతలు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సాగు ఖర్చుల ప్రకారం బస్తాకు కనీసం రూ.200 అయినా పెంచితే బాగుంటుందని అంటున్నారు. పెంచిన ధరలను పునఃసమీక్షించాలని రైతులు కోరుతున్నారు.
సాగు ఖర్చుల భారం..
కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలు ప్రకటిస్తూనే ఉంది. అయితే అనుకున్న మేర పెంచడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. కంటితుడుపుగా మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోందని, రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. 2018–19 నుంచి ఇప్పటి వరకూ ఏటా సగటున వరి ధాన్యంపై సరాసరి రూ.100 లోపే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో రూ.1300 ఉండే కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు రూ.1800కు చేరుకున్నాయి. డీజిల్, విత్తనాలు, దుక్కు ఖర్చులు, లేబరు ఖర్చులు, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్ని రకాల ధరలూ భారీగా పెరిగాయి. మొత్తమ్మీద సాగు ఖర్చులు ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.16 వేలకు పెరిగాయి. దీంతో దీనికి తగ్గట్టుగా మద్దతు ధరలను పెంచాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
2018 నుంచి వరికి కనీస మద్దతు ధరలు ఇలా..
సంవత్సరం సాధారణ రకం గ్రేడ్ఏ రకం
(రూ.లలో) (రూ.లలో)
2018–19 1750 1777
2019–20 1815 1835
2020–21 1865 1888
2021–22 1940 1960
2022–23 2020 2060
2023–24 2183 2203
2024–25 2300 2320
2025–26 2369 2389
పెరిగిన సాగు ఖర్చులు
పని గతేడాది ఇప్పుడు
లేబరు (ఒకరికి) రూ.400 రూ.600
దుక్కికి (గంటకు) రూ.900 రూ.1100
రోటావేటర్(గంటకు) రూ.1200 రూ.1400
విత్తనాలు(30కేజీలు) రూ.900 రూ.1140
ఉడుపు రూ.3200 రూ.4000
ఆకుతీత(ప్యాకెట్) రూ.1800 రూ.2300
గాబుతీత రూ.3000 రూ.4200
కంబైండ్ హార్వెస్టెర్ రూ.2600 రూ.3000
గిట్టుబాటు కాదు..
నేను 20 ఏళ్లగా వ్యవసాయం చేస్తున్నా. పెరుగుతున్న సాగు ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు పొంతన ఉండటంలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేళ్ల క్రితమే ప్రకటించినా కేంద్రం మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం రైతులకు నష్టాలకు గురి చేస్తుంది. వాతావరణంలో ఏమాత్రం తేడా వచ్చినా పెట్టినా ఖర్చంతా వృథాయే. – సురంగి నర్సింగరావు,
చింతువానిపేట, నరసన్నపేట
మద్దతు ధరలు పెంచాలి..
సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత తక్కువ మద్దతు ధర పెంచడంతో ఏ మాత్రం లాభం లేదు. అన్ని రకాల ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటంచాలి.
– పోలాకి రమణయ్య, ఉర్లాం, నరసన్నపేట
ఇదేం మద్దతు?
ఇదేం మద్దతు?
ఇదేం మద్దతు?


