
ఈస్ట్ కోస్ట్ జీఎంతో నబరంగ్పూర్ ఎంపీ భేటీ
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ జీఎం పరమేశ్వర్ ఫఖువాల్తో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి శనివారం భేటీ అయ్యారు. శనివారం జీఎం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. జయపూర్–నబరంగ్పూర్, జయపూర్–మల్కన్గిరి, మల్కన్గిరి–భద్రాచలం, నబరంగ్పూర్ –జునాఘడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి పై చర్చించారు. రాయగడ రైల్వే డివిజన్ లోని గుణుపూర్–తెరువల్లి నిర్మాణ పురోగతి సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
గొర్రెలపై హైనా దాడి
కొరాపుట్: గొర్రెల కావడి మీద హైనా దాడి చేయడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. శనివారం వేకువజామున నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి పడాల్గుడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేణుధర్ తాడి తన ఇంటి సమీపంలో గొర్రెల కావడి నుంచి గొర్రెల అరుపులు రావడంతో అక్కడికి చేరుకున్నాడు. అయితే మనుషుల అలికిడి విని ఒక అటవీ జంతువు పరారయ్యింది. లోపలికి వెళ్లి చూస్తే 4 గొర్రెలు మృతి చెందాయి. మరో రెండు తీవ్రగాయాలు పాలై ఉన్నాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గొర్రెలకు ఉన్న గాయాలు ప్రకారం ఇది హైనా దాడిగా అనుమానించారు. అటవీ శాఖ సిబ్బంది గాయపడిన గొర్రెలకు చికిత్స అందజేస్తున్నారు.
ఈనెల 7 వరకు వర్షాలు
● 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
భువనేశ్వర్: రాష్ట్రంలో కాలవైశాఖి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం ఈనెల 7వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో 8 జిల్లాలకు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన సంకేతాలతో తుఫాన్ పోలిన వాతావరణం తాండవిస్తుందని వాతావరణ కేంద్రం సమాచారం. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. వీటిలో మయూర్భంజ్, సుందర్గఢ్, కెంజొహర్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, గజపతి మరియు గంజాం జిల్లాలు ఉన్నాయి. ఉపరితల గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ సూచన. కాల వైశాఖి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో మరో 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 7వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో సమగ్రంగా పగటిపూట ఉష్ణోగ్రత మారే అవకాశం లేదు. రానున్న రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ సమాచారం.
శ్మశానంలో తేనెటీగల దాడి
కొరాపుట్: శ్మశానంలో తేనెటీగలు దాడి చేయడంతో అంత్యక్రియలకు వచ్చిన వారు చెల్లాచెదురయ్యారు. శనివారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి లౌడి గ్రామానికి చెందిన సమికా ఖొరా అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామస్తులు అంత్యక్రియల కోసం శ్మశానంలో ఏర్పాట్లు చేశారు. మృతదేహంపై కర్రలు కప్పుతుండగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో అంతా పరుగులు తీశారు. కొందరు నదిలో దూకారు. 15 మంది గాయపడడంతో వారిని సుంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు పీతం పాఢి, రఘురాం పోడాల్, ప్రపుల్ల పంగి పరామర్శించారు.

ఈస్ట్ కోస్ట్ జీఎంతో నబరంగ్పూర్ ఎంపీ భేటీ