
10న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన
భువనేశ్వర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 10న భువనేశ్వర్ చేరుకుంటారు. తొలి పర్యటనలో జట్నీ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి సాయంత్రం పూరీలో పర్యటిస్తారు. శ్రీమందిరంలో శ్రీజగన్నాథుని దర్శించుకుని పూజాదుల్లో పాల్గొంటారు. ఆ రాత్రి పూరీలో బస చేస్తారు. మరుసటి రోజు పశ్చిమ ఒడిశా సందర్శిస్తారు. సంబలపూర్ ప్రాంతంలో మా సమలేశ్వరి మాత ఆలయం సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భువనేశ్వర్ జనతా మైదాన్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తెలిపారు.
రాధాకృష్ణ దేవాలయ
నిర్మాణానికి భూమిపూజ
కొరాపుట్: రాధాకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని నీలకంఠ నగర్–ఇచ్ఛావతి గుడల మధ్య నూతనంగా నిర్మి్ంచనున్న ఆలయ పనులకు నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి శుక్రవారం భూమి పూజ చేశారు. వేద పండితుల సమక్షంలో మట్టిని పోసి తొలి క్రతువు ముగించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కను దాస్ పాల్గొన్నారు.
తాగునీటి బాటిళ్లలో నాటుసారా
భువనేశ్వర్: మినరల్ వాటర్ బాటిళ్లలో నాటుసారా అమ్మకం గుట్టు రట్టయ్యింది. ఖుర్దా జిల్లా భువనేశ్వర్ శివారు దారుఠెంగో ప్రాంతంలో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఆకస్మిక దాడుల్లో అబ్కారీ విభాగం పోలీసులు 10,000 లీటర్ల నాటుసారాతో మినరల్ వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.19 లక్షలుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి మూడు నాలుగు చక్రాల వాహనాలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
దంపతుల ఆత్మహత్య
రాయగడ: ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరించారు. వారి దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతుండేది. అయితే ఏ కష్టమొచ్చిందో గానీ ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన జిల్లాలోని చంద్రపూర్ సమితి లక్ష్మీపూర్ గ్రామంలో గల నువాసాహిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతులను కేదార్ కుసులియా (32), శ్రీయా బొడొనాయక్ (27) లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ ఎస్డీపీఓ సంతొషిణి ఓరం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బిసంకటక్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
విజిలెన్స్ వలలో
దశమంతపూర్ సీడీపీఓ
కొరాపుట్: విజిలెన్స్ వలకు అవినీతి సీడీపీఓ చిక్కారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సీడీపీఓ శకుంతల దాస్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అరెస్టయ్యారు. అదముండా గ్రామ అంగన్వాడీ వర్కర్ మినతి ఖొస్లా విధి నిర్వహణ పత్రాలు ఆమోదించడానికి రూ.10 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వలేని మినతి జయపూర్ విజిలెన్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో వారు వల వేసి సీడీపీఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం జయపూర్ విజిలెన్స్ కార్యాలయానికి తరలిస్తున్నారు.

10న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

10న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

10న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన