
భారీ విమానయాన ప్రణాళికల ఆవిష్కరణ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రామాణికలతో కూడిన భారీ విమానయాన ప్రణాళికని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పారాదీప్లో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, 15 జిల్లాల్లో హెలీపోర్ట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విమానయాన మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశలో ఇదో కీలకమైన అడుగు. స్థానిక లోక్ సేవా భవన్లో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాష్ట్ర విమానాశ్రయాలు ఆధునీకరణ, విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ ప్రామాణికలు లక్ష్యంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. పారదీప్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రణాళికలను ఆవిష్కరించింది.
పూరీ విమానాశ్రయ సన్నాహాలు వేగవంతం
పూరీలోని శ్రీ జగన్నాథ్ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విమాన రాకపోకలకు ఆదరణ పెరుగుతున్నందున విమానయాన అనుసంధానం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు, సందర్శకుల రాకపోకలతో నిత్యం కిటకిటలాడే పూరీ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాధాన్యతని ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో వైమానిక ప్రయాణ సౌకర్యాలు పెంపొందించడానికి విస్తృత వ్యూహాన్ని ప్రతిబింబిస్తూ 15 జిల్లాల్లో హెలీపోర్ట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నట్లు ఈ సమావేశంలో ప్రస్తావించారు.
హెలిపోర్ట్లు, విమానయాన కేంద్రాల అభివృద్ధి
ప్రాంతీయ ప్రాధాన్యతను మెరుగుపరచడానికి 15 జిల్లాల్లో హెలిపోర్ట్లను నిర్మించే ప్రతిపాదనకు ప్రాధాన్యత కల్పించారు. ఢెంకనాల్ బిరాషోల్ ఎయిర్స్ట్రిప్ వద్ద బిజూ పట్నాయక్ ఏవియేషన్ సెంటర్ భవిష్యత్ అభివృద్ధి ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ప్రజా నిర్మాణ విభాగం నోడల్ ఏజెన్సీగా నియమించారు.
రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి
రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో విమానయాన అనుసంధానం మరింత పెంపొందించేందుకు జయపురం, దండబోస్, రొంగైలుండా, గోటమా, సతిభట, రైసువాన్, తుషారా, జమదర్పాలి, మల్కన్గిరి, అమర్దా రోడ్ మరియు ఉత్కెలాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాలపై దృష్టి సారించారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలపై దృష్టి
రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు, డ్రోన్ హబ్లతో కూడిన ప్రపంచ స్థాయి విమానయాన సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే నిబద్ధతను ముఖ్యమంత్రి మాఝీ పునరుద్ఘాటించారు. ఒడిశా విమానయాన రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన మానవ వనరుల ప్రతిపాదనలను చర్చించారు.
కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
15 జిల్లాల్లో హెలీపోర్ట్లు