
మీనాజోలను తీర్థస్థలంగా మారుస్తాం
● రాష్ట్ర రవాణా, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితిలో పులాపొలియా, వంశధార, చవులధువా నదుల కలిసే త్రివేణి సంగమంగా గుర్తింపు పొందిన మీనాజోల ప్రాంతాన్ని తీర్థ స్థలిగా గుర్తించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని రాష్ట్ర రవాణా, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న అన్నారు. సోమవారం నాడు మీనాజోలలో కొత్తగా నిర్మించిన మీనకేతనేశ్వర్ మందిరం ప్రారంభోత్సవంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ నుంచి తీసుకువచ్చిన స్పటిక లింగం ప్రాణ ప్రతిష్టోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మందిరం, లింగం ప్రతిష్టోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జెన్న అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో గల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో మీనాజొల ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా గుర్తించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. మూడు నదుల సంగమంగా గుర్తింపు పొందిన మీనాజొలలో ఏటా శివరాత్రి నాడు ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుందని అన్నారు.
ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాంతానికి పర్యాటక స్థలంగా గుర్తింపు దక్కితే ఇక్కడ కొలువై యున్న మీనకేతనేశ్వర్ మందిరం కూడా పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతుందని అభిప్రాయపడ్డారు. పర్యటకులకు, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ప్రాంతాభివృధ్దికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. మీనాజోల ఆధ్యాత్మిక కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పండ నేతృత్వంలో ఈ ప్రాంతం ఎంతొ అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి జెన్న అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకుడు శివకుమార్ పట్నాయక్, యాల్ల కొండబాబు, కాళీరాం మాఝి తదితర ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు పద్మపూర్ సమీపంలో గల ముచికిపొదొరొ కూడలిలో మంత్రికి యాల్ల కొండబాబు అతని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.

మీనాజోలను తీర్థస్థలంగా మారుస్తాం

మీనాజోలను తీర్థస్థలంగా మారుస్తాం