
స్వాభిమాన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలో మంగళవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, ఎస్పీ వినోద్కుమార్ పటేల్ పర్యటించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మావోల అలజడి ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో గిరిజనులు ఎక్కువగా గంజాయి సాగు చేసేవారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ల రాకతో మావోలు తగ్గిపోయారు. గిరిజనుల్లోనూ చైతన్యం వచ్చింది. ఈ సందర్భంగా గిరిజనులతో చర్చించిన కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేతు యోజన పథకంలో ఈ ప్రాంతంలో గిరిజనుల ఉపాధి కోసం గాను పసుపు, చోడి, అల్లం తదితర పంటలు పండించుకునేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు సందర్శించారు.