
రాష్ట్రంలో తొలి రోబోటిక్ మోకాలి మార్పిడి విజయవంతం
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి రోబోటిక్ మోకాలి మార్పిడి విజయవంతమైంది. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం ఈ విజయవంతమైన శస్త్ర చికిత్స నిర్వహించింది. ఒడిశా, తూర్పు భారత దేశ ప్రభుత్వ రంగ వైద్య సంస్థల్లో ఇదే మొట్టమొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి విధానం కావడం విశేషం. అత్యాధునిక రోబోటిక్ మోకాలి మార్పిడి సౌకర్యాన్ని ప్రవేశపెట్టి ఎయిమ్స్ భువనేశ్వర్ మైలురాయిని ఆవిష్కరించింది. ఈ ప్రాంతంలో అధునాతన వైద్య సంరక్షణకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. స్థానిక ఎయిమ్స్ ఆర్థోపెడిక్స్ విభాగం వైద్య నిపుణుల బృందం 66 ఏళ్ల మహిళా రోగిపై మొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సని విజయవంతంగా నిర్వహించడం అత్యద్భుతమని వైద్య నిపుణుల వర్గం హర్షం వ్యక్తం చేసింది. కచ్చితత్వం, అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించిన ఈ ప్రక్రియ సజావుగా సాగింది మరియు ఆపరేషన్ తర్వాత రోగి ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఎయిమ్స్ భువనేశ్వర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోబోటిక్ శస్త్ర చికిత్స సౌకర్యం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఇది సమాజంలోని అన్ని వర్గాలకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేలా చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో తొలి రోబోటిక్ మోకాలి మార్పిడి విజయవంతం