
స్వగ్రామంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు
భువనేశ్వర్: జమ్ము కశ్మీరు పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ప్రశాంత్ శతపతి మృతదేహం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి గురువారం ఉదయం బాలాసోర్ జిల్లా ఇసాణి గ్రామానికి చేరుకుంది. గ్రామమంతా విషాద వాతావరణం నెలకొంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సీనియర్ పోలీసు అధికారుల వరకు అందరూ రాత్రి పొద్దుపోయే వరకు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. పెహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, స్థానిక లోక్ సభ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి సంతాపం ప్రకటించారు. పుష్ప గుచ్ఛంతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దివంగత ప్రశాంత శత్పతి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. కుమారుని విద్యాభ్యాసం బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వీటితో బాధిత కుటుంబీకులకు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రశాంత్ మృత దేహం స్థానిక విమానాశ్రయం చేరడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, సీనియర్ పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఆ తర్వాత మృతదేహం బాలాసోర్ జిల్లాలోని అతని స్వగ్రామం ఇసాణి గ్రామానికి తరలించారు. బాలాసోర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని మైనరు కుమారుడు ముఖాగ్ని పెట్టి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యక్షంగా అంత్యక్రియలకు హాజరయ్యారు.

స్వగ్రామంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు

స్వగ్రామంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు

స్వగ్రామంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు