
లిఫ్టులో చిక్కుకుని రోగి మృతి
భువనేశ్వర్: చికిత్స కోసం తరలిస్తున్న రోగి లిఫ్టులో చిక్కు కుని అకాల మరణానికి గురయ్యారు. ఈ విచారకర సంఘటన భద్రక్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలు భద్రక్ జిల్లా రాండియా పంచాయతీ నర్సింగపూర్కు చెందిన మీనతి పరిడాగా గుర్తించారు. మీనతి పరిడాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భద్రక్ జిల్లా ప్రధాన వైద్య ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను మహిళా వైద్య వార్డుకు తీసుకెళ్లమని డాక్టర్ సలహా ఇచ్చారు. వైద్యుని సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆమెను లిఫ్ట్లోని మహిళా వైద్య వార్డుకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో విషాదం చోటు చేసుకుంది. రోగిని లిఫ్ట్లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో రోగి నుజ్జునుజ్జు అయి చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత వర్గాన్ని బుజ్జగించి పరిస్థితిని చక్కదిద్దారు.
ఉగ్రమూకలను అణిచివేయాలి
రాయగడ: జమ్మూ–కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై దాడులకు తెగబడిన ఉగ్రమూకలను అణిచివేయాలని స్థానిక హిందూ ఐక్యతా సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ మేరకు స్థానిక జగన్నాథ మందిరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు పట్టణంలో ర్యాలీలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరు తూ వినతిపత్రం అందజేశారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
రాయగడ: గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఫరూల్ పట్వారి తెలియజేశారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో గురువారం జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలను అభివృద్ధి చేస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు పంచాయతీల్లోని వివిధ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా అదనపు ఎస్పీ విష్ణు ప్రసాద్ పాత్రో, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుభద్ర యోజనలో భాగంగా లబ్ధిదారులు ఆర్థిక సహకారం అందజేశారు.
హత్య కేసులో 28 మంది అరెస్టు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసుస్టేషన్ పరిధి హటొపొదొరొ వీధిలో నివసిస్తున్న భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వీధిలోని కొందరు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు 28 మందిని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరైస్టెనవారిలో ఏడుగురు మైనర్లు కావడంతో వారిని జిల్లా కేంద్రంలోని ఫోకస్ కోర్టుకు తరలించారు. అదేవిధంగా సంఘటన జరుగుతున్న సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై దాడి చేసిన విషయమై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారిలో కొంతమంది ఉండగా, మరి కొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

లిఫ్టులో చిక్కుకుని రోగి మృతి

లిఫ్టులో చిక్కుకుని రోగి మృతి

లిఫ్టులో చిక్కుకుని రోగి మృతి