తాగునీరు | - | Sakshi
Sakshi News home page

తాగునీరు

Apr 25 2025 12:48 AM | Updated on Apr 25 2025 12:48 AM

తాగునీరు

తాగునీరు

త్వరలో ప్రతి గ్రామానికి ..

భువనేశ్వర్‌: 2026 నాటికి అన్ని గ్రామాలకు తాగు నీటిని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ హామీ ఇచ్చారు. పూరీలో గురువారం జరిగిన జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పటికీ తాగునీరు, విద్యుత్‌ సరఫరా, పక్కా ఇల్లు, రహదారులు వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉన్నారని అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం వికసిత్‌ గాంవ్‌, వికసిత్‌ ఒడిశా (అభివృద్ధి చెందిన ఒడిశా కోసం అభివృద్ధి చెందిన గ్రామం) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి పంచాయతీ రాజ్‌, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యక్రమానికి రూ. 10,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. 2026 నాటికి ప్రతి గ్రామానికి తాగునీరు, రోడ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ పక్కా ఇళ్లు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అభయం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంత్యోదయ గృహ జోజన (ఏజీజే) కింద నిరాశ్రయులు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీత్య బాధితులు వంటి పేదలు, నిరుపేదలకు 5 లక్షల ఇళ్లను అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం అంత్యోదయ గృహ యోజన కోసం బడ్జెటులో రూ. 2,600 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో ఈ పథకం కింద మొత్తం రూ.7,550 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 314 మండలాల్లో రూ. 4,124 కోట్ల వ్యయ ప్రణాళికతో స్టేడియంల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సుభద్ర యోజన కింద 2 లక్షలకు పైగా మహిళా లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా ఆయన రూ. 200 కోట్ల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ మహిళలు 2 విడతల కింద సమగ్రంగా రూ.10,000 ఆర్థిక సాయం పొందారు. మహిళల ఆకర్షిత సుభద్ర యోజన పథకం కింద 2.09 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌, తాగునీటి శాఖకు చెందిన 3 పోర్టల్‌లు ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో పంచాయతీ రాజ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, పంచాయతీ మానిటరింగ్‌ సిస్టమ్‌ మరియు ఈ–పంచాయత్‌ సభ పోర్టల్‌లు ఉన్నాయి. ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజన లబ్ధిదారులకు సబ్సిడీలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78,000 సబ్సిడీని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 60,000 సబ్సిడీని అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 613 పంచాయతీలకు ఐదో రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు కింద రూ. 32 కోట్లు పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement