కృష్ణా వర్సిటీ వీసీ ఆచార్య రాంజీ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సాంకేతిక విప్లవం నేపథ్యంలో ఉన్నత విలువలతో విద్యార్థులు ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంజీ కూన చెప్పారు. కేబీఎన్ కళాశాల 61వ వార్షికోత్సవం రెండో రోజైన గురువారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కేరింతల నడుము సందడిగా జరిగింది. తొలుత శ్రీ పద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ రాంజీ కూన మాట్లాడుతూ సాంకేతిక ఏదైనా విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా విద్యనభ్యసించి ఉన్నతి సాధించాలన్నారు. క్వాంటం టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలు ప్రపంచంలో నూతన విప్లవానికి నాంది పలకనున్నాయన్నారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ప్రయోజకులు కావాలన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేబియన్ కళాశాల విద్యార్థులు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి వార్షిక నివేదికను అందించారు. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయకుమార్, కేబీఎన్ కళాశాల అధ్యక్షుడు ఉసిరిక ఉమా మహేశ్వర రావు, ఉపాధ్యక్షులు చిట్టూరి నాగేంద్ర కుమార్, కోశాధికారి హరగోపాల్, కమిటీ ఏవో డాక్టర్ వి. నారాయణరావు తదితరులు ప్రసంగించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3.50 లక్షలు నగదు, 304 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జిల్లాలో రాత్రి సమయాల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, దొంగతనం కేసుల్లోని సంఘటనా స్థలంలో సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానితులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం తమకు అందిన సమాచారంలో వన్టౌన్ తారాపేట రైల్వేస్టేషన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా నిందితుడు ఆరేపల్లి దుర్గారావు కంగారు పడి, తన మోటార్ సైకిల్ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోరీ కేసులో రూ. 3.50 లక్షలు నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పెడన, ఏలూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసుల్లో 304 గ్రాముల వెండిని రికవరీ చేసినట్లు తెలిపారు.
వ్యసనాలకు బానిసై..
కాగా మచిలీపట్నం మేకవారిపాలెంకు చెందిన ఆరేపల్లి దుర్గారావు వ్యసనాలకు బానిసై పనులకు వెళ్లి సంపాదించే డబ్బులు సరిపోక, నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఇప్పటి వరకూ విజయవాడ సిటీతో పాటు, పరిసర జిల్లాలో 80 వరకూ దొంగతనాలకు పాల్పడినట్లు ఏడీసీపీ రాజారావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కిషోర్బాబు తమ సిబ్బంది కృషి చేసినట్లు పేర్కొన్నారు.


