గ్రామీణ వైద్యంపై సమ్మెట
24 రోజులు సమ్మెలో ఉన్న పీహెచ్సీల వైద్యులు డాక్టర్ల ఆందోళనతో నిలిచిన ఆరోగ్య కార్యక్రమాలు సమ్మె ముగిసినా గాడిన పడేందుకు మరింత సమయం ఇండెంట్ పెట్టే వారు లేక పీహెచ్సీల్లో మందుల కొరత ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 72 పీహెచ్సీలు
సక్రమంగా అమలుచేస్తాం
మందుల కొరత
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామీణ వైద్యం దారితప్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు 24 రోజుల పాటు సమ్మెలో ఉండటంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఆందోళన విరమించి వైద్యులు విధుల్లో చేరినా, పెండింగ్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. సంచార వైద్యం గాడిన పడేందుకు వారం, పది రోజుల సమయం పడుతుందని వైద్యులు భావిస్తున్నారు. 25 రోజుల పాటు పర్యవేక్షించేవారు లేక హైరిస్క్ గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారు. వైద్యాధికారుల లాగిన్లో ఉండే పలు ఆరోగ్య కార్యక్ర మాలు దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా గాడితప్పిన గ్రామీణ వైద్యం మళ్లీ సజావుగా సాగేదెన్నడో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సమ్మె కాలంలో ఇండెంట్ పెట్టే వారు కూడా లేక మందులు కొరత నెలకొంది.
మొత్తం 72 పీహెచ్సీలు
ఎన్టీఆర్ జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 50 చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 130 మంది వరకూ వైద్యులు పనిచేస్తున్నారు. వారంతా 24 రోజుల సమ్మె చేయగా, అంతకు ముందు సైతం నిరసనలో ఉన్నారు. ఆ సమయంలో కార్యక్రమాలు ఏమీ పట్టించుకోలేదు. సమ్మె కాలంలో ఇన్చార్జి వైద్యులను నియమించినా వారు మొక్కుబడిగా విధులు నిర్వహించి వెళ్లిపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పీహెచ్ సీల్లో చేయాల్సిన పనులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. ఆరోగ్య కార్యక్రమాలతో పాటు, మందుల ఇండెంట్లు, ఇలా అన్ని రకాల సేవలు నిలిచిపోగా, అవన్నీ మళ్లీ గాడిన పడేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని సీనియర్ వైద్యులే అంటున్నారు.
సంచార వైద్యం లేక..
గత ప్రభుత్వంలో అమలు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రస్తుతం సంచార వైద్యం పేరుతో నిర్వహించారు. అదికూడా మొక్కుబడిగా నిర్వహించగా, సమ్మెకాలంలో నిలిచిపోయింది. మళ్లీ రూట్ మ్యాపింగ్ ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పెండింగ్ పనులు ఎక్కువగా ఉన్నందున దానిని తిరిగి అమలు చేసేందుకు వారం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే మందుల కోసం సుదూర ప్రాంతంలోని ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
వైద్యుల సమ్మెతో కొన్ని కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం వైద్యులందరూ విధుల్లో చేరడంతో సోమవారం నుంచి కార్యక్రమాలపై పర్యవేక్షణ చేస్తాం. మందుల కొరత, ఇతరాత్ర అన్ని విషయాలపై దృష్టి పెడతాం. వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాం, ఆరోగ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ యుగంధర్, డీఎంహెచ్ఓ, కృష్ణా జిల్లా
నెల రోజుల పాటు పీహెచ్సీ వైద్యులు నిరస నలు, సమ్మె చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో మందుల కొరత నెలకొంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్స్లో బీపీ మందులు లేవంటున్నారు. రామవరప్పాడులో ఉన్న హెల్త్ క్లినిక్లో ఓ రోగి వెళ్లి బీపీ మందులు అడగ్గా లేవని అక్కడి సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఇలా అన్ని ప్రాంతాల్లో నెల రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులకు వాడే పలు రకాల మందులు అందుబాటులో లేవంటున్నారు. ఇప్పుడు జిల్లా అంతా ఒకేసారి మందులకు ఇండెంట్ పెట్టినా అవి ఎప్పటికీ అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులకు మరిన్ని రోజులు కష్టాలు తప్పేలా లేవు.


